అంశం) ధన్యులైన గొర్రెల కాపరులు (క్రిస్మస్ సందేశాలు)
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
గొర్రెలను పొలములో మందకట్టు దినాలు అనగా శీతాకాలము (అక్టోబరు-డిసెంబరు మాసములు). పస్కా పండుగ తరువాత పశువులను పొలములోనికి తీసుకువెళ్ళి తొలకరి వరకు అక్కడే వారు గొర్రెల మందలతో పాటు వుంటారు. ప్రభువు డిసెంబరు మాసములో పుట్టినట్టు చెప్పటకు ఆధారాలు తక్కువైనా, ఆయన పుట్టినది సత్యము కాబట్టి శీతాకాలములోనే పుట్టి యుంటాడని మాత్రము చెప్పడానికి ఆధారం; కాపరులు గొర్రెలను పొలములో కాచుకొనుచున్న సందర్భము మాత్రమే. కాపర్లు సర్వసాధారణముగా పామరులు. తమ గొట్టెలపట్ల ప్రాణసహితమైన బాధ్యత కలిగివుంటారు. వారి గొర్రెలే వారికి సంపద, సమస్తము. యేసు జన్మమును గూర్చిన వర్తమానము ప్రధమంగా కాపరులకే తెలియజేయబడింది. ఆయన జ్ఞానులకుకాక అజ్ఞానులకే ప్రాధాన్యత నిచ్చినాడు. “నేను జ్ఞానిని” ” అనుకొనువారికి సువార్తలేనట్టే. ఆ దినాల్లో మోషే ధర్మశాస్త్రాన్ని బోధించే పండితులు ఎందరో వున్నా ఆ వారందరికి ప్రాధాన్యత నివ్వలేదుగాని, ఆజ్ఞానులకు బయలుపరిచాడు. ఎందుకనగా వారు సులువుగా లోబడు ప్రజలు. మరి లోకరక్షకుని కొరకు యదార్థముగా ఎదురు చూచువారు. దైవ వర్తమానము వినిన కాపరులు ఏవిధంగా ఆశీర్వదింపబడ్డారో ధ్యానించుకుందాం.
1. ప్రభువు మహిమను చూచిరి
🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑
ప్రభువు మహిమ వారి చుట్టు ప్రకాశించెను (లూకా 2:9). పరిశుద్ధ గ్రంథములో తమ పనిలో నమ్మకముగానుండు వారనేకులు దేవుని మహిమను చూచారు, దేవుని స్వరము విన్నారు. మోషే తన మామ మందను మేపుచుండగా దేవుని పర్వతమందు దేవుని మహిమనుచూచి, దేవుని స్వరము విని ఇశ్రాయేలీయులను గొప్ప సైన్యమును నడిపించిన నాయకుడు (నిర్గ 3:1-8). దావీదు గొట్టెల దొడ్డిలో నుండగా అతని పిలిచి ఇశ్రాయేలీయులను మేపుటకై రప్పించాడు (కీర్త 78:70). శిష్యుడైన యోహాను యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పత్మసు ద్వీపములో పరవాసిగా నుండగా మహాతేజస్సుతో ప్రకాశించు సూర్యుని వలెనున్న ప్రభువును చూచాడు. ఆయనను చూడగానే చచ్చిన వానివలె ఆయన పాదముల యొద్ద పడ్డాడు (ప్రక 1:17). ఈ మహిమను (షెకీనా) అంటారు. అనగా “దేవుని సన్నిధి" అని అర్థము .సహోదరీ, అనుదిన జీవితంలో దేవుని మహిమను అనుభవిస్తున్నావా? ప్రభువైన యేసుక్రీస్తే ఆ గొప్ప వెలుగు, ఆయనే దేవుని మహిమ. అనుదినము ఆయన వాక్యరూపములో ఆయనను చూడగలము.
2. సువర్తమానము వినిరి
⭕⭕⭕⭕⭕⭕⭕⭕
ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను” (లూకా 2:10). ప్రతి సువార్తలో సంతోషవర్తమానముంటుంది. ఆ వర్తమానమును స్వీకరించువారికే సంతోషాన్నిస్తుంది. కొందరికి ఆ ధన్యకరమైన వర్తమానం తలకెక్కదు. శుభవార్త చెప్పినా, దుర్వార్త చెప్పినా వాళ్ళది ఏడుపు ముఖమే. సువార్త ప్రకటిస్తూ వుంటే అదేమీ పట్టనట్టు పక్కకు తొలగిపోతారు. ప్రియులారా, సువార్త వినకపోతే రక్షకుని చిరునామా నీకు తెలియదు. ఆయనను కనుగొనలేవు. గొర్రెల కాపరులు పొందిన మహా సంతోషాన్ని పొందలేవు. సువార్త వినుట వలన రక్షణ పొందగలము (1 కొరిం. 15:2, 3). ఆ దినాన క్రీస్తు జన్మ సువార్తను దూత ప్రకటిస్తే, ఈ దినాల్లో క్రీస్తు మన హృదయాల్లో ఆత్మ రక్షకుడుగా జన్మించు నిమిత్తము సువార్తికులే దూతల స్థానాన్ని పొందారు. మనము ఆత్మవిషయములో దేవుని బట్టి జీవించునట్లు మనకును సువార్త ప్రకటింపబడుచున్నది. మన స్పందన ఎంతవరకు ? క్రైస్తవులు, ఈ సువార్త మాకు కాదు అనుకుంటే ఈ మాటలు మనవి కాదు క్రైస్తవులవి అని ఇతరులు అనుకుంటున్నారు. అందుచేత విత్తబడిన వాక్యము మంటిబెడ్డల క్రింద వ్యర్థమైపోతుంది. ఆయన వచ్చి దూరస్టులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించను” (ఎఫెసీ 2:17). సువార్తకు లోబడుట ద్వారా, మనకు రక్షణతోపాటు :
1. భయములో ధైర్యము; (కీర్త 34:4),
2. ఆతృతలో ఆదరణ (కీర్త 46: 1);
3. దుఃఖములో ఓదార్పు (కీర్త 3(): 11 ),
4. ఓటమిలో జయము (రోమా 8:37);
5. కృంగుదలలో నిరీక్షణ (కీర్త 42:11),
6. సంశయములో ఋజువు (హెబ్రీ 11:1);
7. ఒంటరితనంలో ఆధారం (హెబ్రీ 13:5). వీటన్నిటిని పొందగలము. ప్రియుడా, సువార్తకు లోబడి కాపరులవలె ఆశీర్వదింపబడాలని కోరుచున్నాము.
3. భయములో అభయము పొందిరి
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
“ఆ దూత భయడకుడి... నేడు మీకు రక్షకుడు పుట్టియున్నాడు” (లూకా 2:11). మనము అసమాధానముతోను, కలవరముతోను నిండియున్న లోకములో వున్నాము ఎక్కడ చూచినా బలాత్కారములు, మోసములు, హత్యలు, ప్రమాదములు, దోపిడిలు ఏ సమయములో ఏమి జరుగుతుందో తెలియని కారడవిలో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాము. అటు నిరుపేదకు ఇటు కుబేరునికి సమాధానము లేని పరిస్థితి. ఎన్ని వున్నా ఆత్మలో సమాధానము లేకపోతే విరక్తి కలిగి ఆత్మ హత్యే మార్గముగా ఎంచుకుంటున్నారు. ఆ నిరుత్సాహక్షణంలో ఒక ఆపద్భాంధవుడు) అడ్డుకుంటే ఎంత మేలు ! అలా ఒక వ్యక్తి కొరకేగాక లోకమును రక్షించడానికి ఒక రక్షకుడు ఉద్భవించాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆయకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము ననుగ్రహించుటకు జన్మించియున్నాడు. యేసు అంటే రక్షకుడు. పాపము వలన వచ్చు జీతము మరణము నుండి విడిపించుటకు ఆయన నరావతారిగా వచ్చియున్నాడు. “జీవితకాల మంతయు మరణభయము చేత ధాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడ రక్త మాంసములలో పాలివాడాయెను” (హెబ్రీ 2:15) ప్రియుడా, ఏ భయము నిన్ను వెంటాడుతుంది. అది ఎంత ఘోరమైనదైనా దానినుండి విడిపించుటకు యేసుప్రభువు వచ్చియున్నాడు. ఈ క్రిస్మసు శుభసందర్భములో ఆయనను రక్షకునిగా స్వీకరించు.
4. దేవుని వర్తమానమని గ్రహించిరి
🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠
జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు” (లూకా 2:15). మనకు సువార్త అందించబడినప్పుడు అది పరలోక వర్తమానమని గ్రహించితేనే తప్ప అది నీకు ప్రయోజకరము కాదు. ఆ బోధించువారు దేవుని చిత్త ప్రకారమే భారముతో బోధిస్తారు. వారి పనులు మాని, వ్యయప్రయాసలకోర్చి, ఆరోగ్యములను లెక్కచేయక, నశించిపోవు ఆత్మల రక్షణకై బాధ్యత వహిస్తారు. వారికి ఈ లోక జీతభత్యాలతో నిమిత్తము లేదు. వారి ఆకలి బాధకంటే
నశించిపోవు వారి పట్ల భారము ముఖ్యమైనది.
కాబట్టి అటువంటి వారి పరిచర్యను ఘనపరచి వారి భోధనలకు ప్రతిఫలంగా మనము క్రీస్తును రక్షకునిగా స్వీకరిస్తే వారికి అదే పరలోకములో బహుమానము. ఎందుకనగా సువార్త ప్రకటించు భారము వారి మీద మోపబడియున్నది (1 కొరిం 9:16). గొర్రెల కాపరులు వారికందించిన సువార్త దేవుని చేత పంపబడినదని యెరిగి వెంటనే స్పందించి కార్యోక్తులయ్యారు. బోధకుల వర్తమానాన్ని దేవుని వర్తమానముగా గ్రహించుట మన విధి.
5. చూచుటకు నిర్ణయించుకొనిరి
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
ఆ గొర్రెల కాపరులు, మనము బెల్లెహేము వరకు వెళ్ళి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొనిరి” (లూకా 2:15). వర్తమానమునకు స్పందించుట దైవాశీర్వమునకు ప్రారంభము. నిర్లక్ష్యము శాపమునకు దారి తీస్తుంది. మోషే తన మామ మందను మేపుచు దేవుని పర్వతమునకు వచ్చినప్పుడు మండుచున్న పొదను, ఆది కాలి పోకుండుటను చూచి, ఈ గొప్ప వింత చూచెదననుకొని ముందుకు వచ్చాడు. యాకోబు
తన మామ మందల యొద్దకు అరణ్యములో నుండగా ... నీవు లేచి యీ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుము"ని (ఆది 31: 13) చెప్పెను. కాపరులు గొట్టెలను కాయుచుండగా పొలములో దేవుని మహిమను చూచి దానికి స్పందించారు. ఈ సంఘటనలను చూచి గమనించినట్లయితే దేవుడు మనలను ఉంచిన స్థలములో మన కర్తవ్యాన్ని యదార్ధముగా నిర్వర్తిస్తూ వుంటే దేవుని మహిమను చూస్తాము. దేవుని వర్తమానం మనకు వుంటుంది. మోషేను పర్వతము మీద, యాకోబు అరణ్యములోను, దావీదును గొట్టెల దొడిలోను, మరి కాపరులను పొలములోను దేవుడు సంధించి వారి ద్వారా మహిమ పొందాడు. ఇలా ఎన్నో ఉదాహరణలు బైబిల్ లో వున్నాయి. దైవకార్యమని తలంచి, క్రీస్తు సంఘాన్ని అక్రమముగా హింసిస్తున్న సౌలు యొక్క అజ్ఞానమును, ఎరిగిన ప్రభువు తనకు ప్రత్యక్షమై, తనకు ఆజ్ఞాపించిన దానికి లోబడి, తన మార్గమును మళ్ళించుకొని పౌలుగా మారి గొప్ప కార్యములను సాధించలేదా? ప్రియులారా, మనము దైవ వర్తమానములు ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెడతాము. ఎంత కాలముగా సువార్తలు వింటూ వున్నాము? మరి క్రీస్తును చూడాలనే ఆశ నీకు కలిగే దెప్పుడు? నీకున్న బాధ్యతలను గూర్చి ఆలోచిస్తూ రక్షణను వాయిదా వేస్తున్నావు. కాపరులకు బాధ్యతలు లేవా? గొట్టెలను పొలములో విడిచిపోయి వారి రక్షకుని కండ్లారా చూచి ఆరాధించడానికి పూనుకున్నారు. మరి నీ నిర్ణయమేమిటి?
6. వారు శిశువును చూచిరి
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి” (లూకా 2:16). కాపర్లు దూత తమతో చెప్పిన సమాచారమును నమ్మి, వెళ్ళి అది కండ్లారా చూచి ఆనందించారు. సువార్తకు లోబడితే దాని ఫలితాన్ని, ఆత్మీయంగానూ, శరీరకంగానూ అనుభవించగలము. విని విడిచి పెడితే విన్నవాక్యము నిష్ప్రయోజనమై పోతుంది. (హెబ్రీ 4:2) అపొ. పౌలుగారు, “ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు (అ.కా. 26:19) అని చెప్పుచున్నాడు. కాపరులు శిశువునే కాక మరియను, యోసేపును కూడా చూచిరి అని వ్రాయబడింది. వీరిరువురును బిడ్డ పుట్టువరకు దేవుని ఆజ్ఞకు విధేయులైనవారు ప్రభువాజ్ఞకు లోబడితే ప్రభువునే కాదు. ఆయనకు విధేయులైనవారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తావు. ప్రియుడా, సహోదరీ, ఎంతోకాలముగా క్రిస్మసు సందేశాన్ని వింటున్నారు. క్రీస్తును రక్షకునిగా కనుగొన్నారా? ధన్యులే. "నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు” అని చెపితే ఎంతో సంతోషించారు ! కారణం వారి మాంసపు గుండె వర్తమానాన్ని త్వరగా స్వీకరించింది. రాతిగుండె, మొండి గుండె త్వరగా వర్తమానాన్ని స్వీకరించదు. లోబడనేరదు. కాపరులు రక్షకుని శిశువు రూపంలో చూచి పరవశులయ్యారు. మనమైతే మన పాపములకు బలియై మృతులలో నుండి లేచి, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న ప్రభువును చూడగలుగుచున్నాము. ఎంత ధన్యులము ! కాని ఆయనకు లాలిపాటలు పాడుచు పసిబాలుడుగానే వూహించుకుంటున్నాము. కాపరులు శిశువును చూచి పరవశులై మౌనముగా వెళ్ళారా ?
7. వారు ప్రచురము చేసిరి
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్నవాటిని గూర్చి దేవుని మహిమ పరుచుచు, స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి” (లూకా 2:20). హృదయము నిండిన దానితో నోరు మాట్లాడుతుంది. కాపరులు వారికి కలిగిన మహాసంతోషాన్ని, హృదయంలోనే వుంచుకొని వెళ్ళలేదు. వారి సంతోషాన్ని ప్రచురము చేసారు (2:17). దావీదు "నా గిన్నె నిండి పొర్లుచున్నది” (కీర్తన 23: 5) అంటున్నాడు. పేతురు, యోహానులు, “దేవుని మాట వినుటకంటె, మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? .... మేము కన్నవాటిని, విన్నవాటిని చెప్పకయుండలేము(అ.కా. 4:19, 20) అని అధికారులతోను పెద్దలతోను చెప్పారు. గెరాసేనుల దేశములోని, సేన అను దయ్యముల నుండి విడుదల పొందినవాడు,
మౌనముగా వున్నాడా, దెకపోలి (10 పట్టణములు) లోనికి వెళ్ళి ప్రకటించాడు కదా(మార్కు 5:20) ప్రభువు శక్తిని, మహిమను కనుగొన్న మగ్దలేనే మరియ “నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెను” (యోహా 20:18) అని చెప్పింది. సమాచారము వినిన శిష్యులు పునరుత్థానుడైన ప్రభువును చూచి సంతోషించారు. ప్రియుడా, సహోదరీ, నీవు ప్రభువును ఎరిగిన సమాచారము నీ పొరుగు వారికి తెలియజేస్తున్నావా? మూత వేయబడిన విశ్వాసిగా, మరుగైన మూగ క్రైస్తవుడిగా వుంటున్నావా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మనివానికి శిక్ష విధింపబడును” (మార్కు 16:15, 16) అని ప్రభువు ఆజ్ఞాపించియున్నాడు. కాబట్టి ప్రభువు నెరిగిన నీవు మౌనముగా నుండవద్దు. నీవు మౌనముగావుంటే రాళ్ళు ప్రకటన చేసి నీకు రావలసిన ఆశీర్వాదము అవి పొందుతాయి. “నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను”(మత్త 28:20).
ప్రియులారా, గొట్టెల కాపరులు, పామరులు, వారి కాపర్వతములో నమ్మకముగా నున్నందున ప్రభువు జన్మ వర్తమానము వారికే ముందుగా ప్రకటింపబడింది. వారు సులువుగా లోబడువారు. కాబట్టి వారు, మొదటగా ప్రభువు మహిమను చూచారు. శుభవార్త విన్నారు. భయములో సమాధానము పొందారు. దేవుని వర్తమానం సావకాశంగా విన్నారు. ప్రభువును కన్నులారా చూచి, ఆ ప్రభువును ప్రచురము చేశారు. వారి జీవితం ధన్యమైంది. మనము పండితులము, తెలివైన విద్యాధికులము. క్రీస్తు సువార్త ప్రకటింపబడినప్పుడు స్వంత జ్ఞానముతో సాకులు చెప్పక, సువార్తకు సులువుగా లోబడి రక్షకుడైన ప్రభువునందు ఆనందించునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి