#ముంగమూరి_దేవదాసు_అయ్యగారు_చెప్పిన
#పరలోక_నిచ్చెన_ప్రసంగము...
దా.కీర్తన. 39; మార్కు 16:16; గలతీ. 1:1.
పై అంతస్తుకు చేరుటకు ఆశించిన ప్రియ విశ్వాసులారా!
ఆదినుండి నేటివరకు, మనము జన్మించిన దినమున ఉన్న పసి పిల్లలముగానే లేము. కాబట్టి శరీర విషయములో ఏరీతిగా ఎదుగుచున్నామో ఆ రీతిగా జ్ఞానములో కూడా ఎదుగవలెను. అవును చిన్నప్పుడు ఉన్న తెలివితేటలకంటె పెద్దయినప్పుడు తెలివి ఇంకా ఎక్కువగానే ఉన్నది. కాబట్టి జ్ఞాన విషయములో ఎదుగుచున్నాము.
ఇందాక చెప్పినట్లు శరీర విషయములో ఎదుగుచూనేయున్నాము.
ఈరెండును మనుష్య జీవితమునకు ముఖ్యము. అయితే ఈ రెండు లోకానికే. శరీరము ఇక్కడే ఉండిపోవుచున్నది.
మనకు జ్ఞానమున్నది. అందుచేత మనము అన్నవస్త్రాదులను సంపాదించుచున్నాము. పొలములో,
పాఠశాలలో, ఆఫీసులో ఉద్యోగము చేసికొనుచున్నాము.
కాని
ఇవి పరలోకములో లేవు. ఈ లోకములో జీవించినంత కాలము మనము జీవించి పరలోకమునకు వెళ్లాలి. భూలోకములో రెండు గొప్ప అంతస్థులున్నవి.
1. శరీరములో, 2. తెలివితేటలలో ఎదుగుట.
ఈరెండు గొప్ప అంతస్తులే. ఈ రెండింటికంటే
పరలోకములోనికెళ్లుట గొప్ప అంతస్థు. ఈ రెండు ఇక్కడ
అభ్యాసము చేసికొంటే పరలోకము వెళ్లుట సుళువు. అయితే ఈ శరీరము ఇక్కడే విడిచి పెడతాము.
అన్నము, బట్టలు, విద్య, ఉద్యోగము కావలెనని ఆశించే ఈ జ్ఞానమునుకూడా ఇక్కడే విడిచి పెడతాము. ఇవన్నీ పరలోకములో లేవు. శరీరముకంటె, జ్ఞానముకంటె గొప్పవి పరలోకములో ఉన్నవి. అవి ఆశించుట
గొప్పకాదా! కాబట్టి మనదృష్టి ఇక్కడ ఉన్నప్పటికిని, ఇవి
అవసరమేగాని మనదృష్టి పరలోకమువైపు ఉండడము మరీ అవసరము.
1. ఆ పరలోక విషయములు 2. ఆ పై అంతస్తు
విషయములు తెలిసికొనుటకు ఇట్టి దేవాలయమే ముఖ్యమైన స్థలము.
అందుచేతనే ప్రతి ఆదివారము దేవాలయానికి వచ్చి
బోధ వింటున్నాము.
ఈ ఈ గుడిలో 1. ఇక్కడే ఉండిపోదాము, 2. ఇక్కడే
జీవిస్తాము అనే బోధ ఉండదుగాని; ఇక్కడ ఉండి పరలోకమునకు సిద్ధపర్చునట్టి బోధ మాత్రమే దేవాలయములో ఉండును. దేవుడు మనకు అనుగ్రహించిన వరములలో ఒకటి దేవాలయము.
క్రైస్తవ పాఠశాలలోను ఈ బోధ ఉంటుంది. కుటుంబ ప్రార్థనలోను, ఉజ్జీవ కూటములోను ఈ బోధ ఉండును.
1. కుటుంబములలో
2. పాఠశాలలో (వేదాంత పాఠశాలలో) 3. ఉజ్జీవ కూటాలలో
4. దేవాలయములలోని బోధ ఇవన్నీ ఒకటే వరుస.
ఇవన్నీ మనలను భూలోకములో ఉండకుండ పరలోకమునకు తీసికొని వెళ్లుటకు సాధనములైయున్నవి. కాబట్టి వీటిలో ఏది వదలి పెట్టినా మనకు పై అంతస్తురాదు. ఈ నాలుగు ఒకదానిలోనే, ఒక
వరుసలోనే ఉన్నవిగాని ఈ నాలుగు కలిసి మరలా ఒక్కదానిలోనే ఉన్నవి.
రంద్రము ఒక చిటకిన వేలంత రంధ్రము పడవకు
ఉన్నట్టే ఇవి అన్నికూడ ఒక్క దానిలోనే ఉన్నవి. ఈ నాలుగు అనగా
1. కుటుంబ ప్రార్థన 2. పాఠశాలలో 3. ఉజ్జీవ
కూటములలో 4. దేవాలయములలో పై నాలుగు కలిసి
ఒకదానిలోనే ఉండేది ఏమిటి? ఏకాంత ప్రార్థన (దైవసన్నిధి) ఒక్కొక్కరు చేసికొనేది.
అప్పుడు అన్నీ కలిసి 5 అయినవి. అవి
ఏమిటనగా క్రైస్తవ మత సంఘములోనే ఈ 5 అనుభవములు కలిసి ఉండును.
కాబట్టి ఈ మత సంఘములోనికి, ఈ 5 అంతస్థులు
ఉన్న మతములోనికి వచ్చే క్రొత్తవారు వీటినిబట్టి, ముఖ్యముగా
పై నాలుగు కలిసి ఉన్న ఐదవదైన, దైవసన్నిధి ప్రార్థననుబట్టి బహుగా ఆనందింపవలెను.
ఈ క్రైస్తవ మతసంఘమనే పడవ
పరలోకానికి తీసికొని వెళ్లేది. ఈ పడవకు రంధ్రములులేవు.
పడవ ఎక్కుట సుళువేగాని మనుష్యుల ఏర్పాటులలో బేధములు ఉన్నవి. ఈ క్రైస్తవ సంఘ పడవకు రంధ్రములు ఎందుకు లేవు అంటే దీనిని దేవుడే నరావతారమెత్తి స్థాపించినందున దేవునికి
రంధ్రాలు లేనట్లు సంఘానికి రంధ్రాలు లేవు.
బహు పూర్వకాలమందు మనుష్యులలో విస్తారమైన పాపము జరుగుట చూచి దేవుడు సహించలేకపోయినాడు. ఆ పాపమున్న
జనాంగాన్ని ఇంకా ఉంచితే తరువాత వచ్చే జనాంగానికి ఆ పాపము అంటుకొని, పాపము ఇంకా పెరుగుచున్నది.
కాబట్టి వారిని ఈ భూమిమీద లేకుండ చేయుటకై ఆకాశములో గొప్ప వర్షము ఒకటి ఏర్పడినది. వీరి పాపమునుబట్టే ఆ విస్తార వర్షము ఏర్పడినది.
ఈ వర్షము పొలములు పండించుటకుకాదు, చెట్లు
పెరుగుటకుకాదు, నదులు నిండుటకుకాదు, దాహశాంతి
నిమిత్తము త్రాగటానికి ఏర్పడలేదు. కాని ఈ పాపాత్ములను ముంచి నాశనము చేయుటకే ఏర్పడినది.
అప్పుడు దేవుడు,
నోవహు అనే ఒక తాతగారిద్వారా ఆ ఓడకట్టే ఏర్పాటు గావించి,
'నోవహు! నీవు ఓడ కట్టుము. కొన్నాళ్లకు ఆకాశమునుండి ప్రచండ వర్షము బహు రౌద్రముతో రానైయున్నది. నీవు
1. ఓడకట్టుము,
2. వర్షము రాబోవుచున్నది 3. అది మిమ్మును ముంచివేయును.
4. ముందుగానే మీరు దీనిలోనికి వస్తే బ్రతుకుతారు అని చెప్పగా;
1) ఆకాశములో మేఘములులేవు 2) ఇవన్ని పిచ్చిమాటలు అని ఎవరు నమ్మలేదు.
దేవుడు:- 1. నమ్మేటందుకు
2.గ్రహించేటందుకు 3. సిద్ధపడేటందుకు 120 సం||లు గడువు ఇచ్చెను. గనుక వారికి ఈ మూడు గడువులు అవసరమే. వారు గ్రహించేటందుకు తాతగారు బోధచేసెను. ఆ బోధే వారు గ్రహించే సమయము. ఆ గ్రహించిన పిదప ఆలోచించి, నమ్మాలి.
ఆలోచిస్తేనేగాని ఎవ్వరూ నమ్మరు. గనుక ఆలోచన తరుణము.
1. బోధ వినే తరుణము 2. విన్నది ఆలోచించేటందుకు
తరుణము 3. సిద్ధపడి ప్రవేశించుటకు తరుణము. ఈ మూడు దేవుడు ఆ పాపాత్ములకు అనుగ్రహించినట్లు మనకును ఆ మూడు అనుగ్రహించుచున్నాడు.
ఓడలో ప్రవేశించుటకును తరుణమున్నది. ఇందాక
చెప్పినట్లు, ఈ లోకములో క్రైస్తవమత సంఘమనే ఓడ ఉన్నది.
ఈ ఓడలోనికి ఈ దినము కొందరు చేరుటకు వచ్చిరి గాన
సంతోషము. ఇదివరకు వినిన వారు, బోధ ఆలోచించి ప్రభువును నమ్మినారు. గనుక బాప్తిస్మము పొందవచ్చిరి. ఆ బాప్తిస్మము ద్వారా బయటనుండి క్రైస్తవమత సంఘ ఓడలోనికి వచ్చుటకు ప్రవేశము దొరకుచున్నది.
ఆ ఓడ ఈ లోకములోనుండి బయలుదేరి, దేవుని సింహాసనము దగ్గరకు, పరిశుద్ధులు, దేవదూతలు, మహిమ స్థానమున్న పరలోకమనే దరికి వెళ్ళుచున్నది. ఈ లోకములో మానవ జీవితానికి ఉన్న అవసరాలు
లేని స్థలానికి వెళ్ళుచున్నది. అక్కడ అన్నము, బట్టలు, కూరలు, ధాన్యము, తిను బండారములు అనే అక్కరలు లేని స్థలమును వెళ్ళుచున్నది.
ఈ అక్కరలు కాదుగాని అన్నీ అక్కరలు తీర్చే
స్థలానికి ఈలోక కష్టాలు లేని స్థలానికి, వెళ్ళుచున్నది.
1. కుటుంబ చిక్కులు, 2. జబ్బులు, 3. ఇబ్బందులు,
4. చావు; ఇవేవి ఉండని స్థలానికి వెళ్ళుచున్నది. గనుక నేడు ఈ సంఘనావలో ప్రవేశించేవారికి పైన చెప్పిన నాలుగు ఉండవు గానీ
1) వెలుగు 2) సంతోషము 3) సుఖము, 4) దేవుని
ముఖకాంతి 5) అనంతకాలము దేవుని సింహాసనము ఉండును.
గాన అది అనుభవించే నిమిత్తమై ఈ ఓడలో చేరువారు ధన్యులు, అదృష్టవంతులు.
నేడు బాప్తిస్మము పొందువారికి గొప్ప పండుగ. అనగా
ఓడ ఎక్కేవారికి పండుగే, అదివరకు ఓడలో ఉన్నవారికి వీరు ఓడ ఎక్కుచున్నందుకు పండుగే.
క్రైస్తవ సంఘ నావలోనికి నోవహు దినములలోవలె రానివారుంటారు. 120 సంవత్సరములు
కష్టపడి, నావకడితే 1) మృగములు, 2) పక్షులు, 3) ఆ
ఎనమండుగురు వెళ్ళిరిగాని అవిశ్వాసులు ఓడలోనికి రాక వర్షములో తడుస్తూ ఇంటికప్పు ఎక్కిరి. వర్షము వారిని తరిమెను.
చెట్లెక్కిరి, అక్కడ కూడ వర్షము తరిమెను; కొండలు ఎక్కిరి. అది వారిని ముంచివేయుటకే వచ్చిన వర్షముగాన అచ్చటకూడ ముంచివేసినది. ఓడ ఎక్కుదామని తలంపు వచ్చినా తలుపులు
వేయబడెను గాన లాభమేమి! ఎక్కుదామన్నా మునిగిచస్తారు.
1. రమ్మని 2. ఓడెక్కమని;
(1) దేవుడు చెప్పిరి (2) తాతగారు చెప్పిరి (3) వరదా చెప్పినది, (4) ఓడలో ఉన్న స్పష్టంతా చెప్పినది
(5) ఎనమండుగురు చెప్పిరి (6) పక్షులు చెప్పినవి (7) ఈ గొప్ప వర్షము చెప్పినా లెక్కలేదు, నశించిపోయిరి.
నేటి దినములలోను అలాగే బోధకులు - పాటలు, వీధి ప్రసంగములు, పత్రికలు, చెప్పినా ప్రజలు వినరు. ఎలాగో ఈవేళ కొందరు ఆ వార్త విని వచ్చినారు. వారికి దీవెన కలుగునుగాక! దేవుడు వారిని ఆశీర్వదించి సిద్ధపరచునుగాక! స్థిరపరుచునుగాక! ఆమేన్.
ఈ ప్రసంగము
ముంగమూరి దేవదాసు అయ్యగారు వ్రాసిన జ్ఞాతవ్యము 5వ భాగము అను పుస్తకము లోనిది.
పేజీ 45-49
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి