*""సాధు సుందర్ సింగ్"" గారు స్విట్జర్లాండ్ లో చెప్పిన ప్రసంగము = 3*
అంశము::
*""సమృద్ధిజీవము""*
పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 10:10 చదివి ప్రసంగమును ప్రారంభించెదము.
*"దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకే వచ్చునుగాని మరి దేనికి నీరాడు; గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను"*
దాదాపు 2 వారముల క్రిందట నేను యెరూషలేమునందు ఉంటిని.
అచ్చట దేవాలయము సమీపమున రక్షకుడు నడిచిన స్థలమందు నేను నడచితిని. శరీరాకారములో ప్రభువు అక్కడ లేకపోయినను అది నాలో గొప్ప
ప్రభావమును కలుగజేసినది. బహుశా ఆ స్థలమందే ఆయన ఈ మాటలను పలికియుండవచ్చును. "
*గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని".* మనము జీవము పొందవలెననియు దానిని సమృద్ధిగా పొందవలెననియు ఆయన చెప్పెను.
*జీవము, సమృద్ధి జీవముల మద్యగల వ్యత్యాసమును స్పష్టపరచుటకు ఒక దృష్టాంతమును చెప్పగోరుచున్నాను.*
*మా దేశమందు కొన్ని సంవత్సరముల క్రిందట ఒక మనుష్యుడు ఉండెను.* దీర్ఘకాల వ్యాధినిబట్టి అతడు ఎక్కువకాలము జీవించని స్థితిలో మంచము మీద ఉండెను. అతనిని పరామర్శించువారు ఎవరును లేరు.
*ఆ సమయమందు తనవైపు ఒక పాము వచ్చుటను చూచెను. తన ప్రాణమును కాపాడుకొనవలెనని అతడు కోరుకొనినను అతని ఆరోగ్యము బాగోలేక పోయినందున ఏమియు చెయ్యలేకపోయెను.* అతనికి జీవము ఉండెను గాని ఆ జీవము నిష్ప్రయోజనముగా నుండెను.
*ఒక రాయిని తీసుకొని ఆ పామును చంపలేకపోయెను.* పాము తనవైపు చూచుటను బట్టి భయపడెను. నిస్సహాయ స్థితిలో ఉండిన అతనిని పాము కరవగా అతడు అర్ధగంట సమయములోనే చనిపోయెను.
*ఆ తరువాత అతని బంధువు ఒకడు వచ్చి పామును చంపెను. అతడు బలవంతుడు గనుక ఆ పామును చంపగలిగెను.* చాలమంది క్రైస్తవులు
జీవమును పొందియున్నారు గాని వారు ఆత్మీయముగా శక్తి లేనివారైయున్నారు.
*పామును చంపుటకు కావలసిన ఆత్మీయ శక్తి వారికి లేదు, వారికి సరిపడు జీవము ఉన్నదిగాని ఆ జీవము నిష్ప్రయోజనమైనదిగా ఉన్నది.* అట్టి క్రైస్తవులు
తమకు తాము సహాయపడలేరు. తమ జీవమును రక్షించుకొనలేని వీరు ఇతరులకు ఎలాగు సహాయపడగలరు? ఎదుటివారి యెడల వీరికి ప్రేమలేదు, ఎదుటివారికి సహాయపడాలనే ఆతృత వీరికి లేదు.
*ఒకవేళ అట్టికోరిక వారికి ఉండినను సహాయపడగలిగిన బలము లేదు. ఇందువలన మనుష్యుల ఆత్మకు శతృవైన సాతాను వచ్చి కాటువేసి వెళ్ళుచున్నాడు.* పాపము వారి ఆత్మలను నశింపజేయుచున్నది. అయితే
రక్షకుడు తాను జీవమును మాత్రమే గాక సమృద్ధి జీవమును ఇచ్చుటకు వచ్చినట్లు చెప్పుచున్నాడు. ఈ సమృద్ధి జీవమును మనము కలిగియుండినపుడు
శత్రువును జయించగలిగినంత బలముగలవారమై యుందుము.
*ఈ సమృద్ధి జీవమును పొందని క్రైస్తవులు ప్రార్థించుటకు ఇష్టపడరు, దేవుని వాక్యమును చదువుటకు ఇష్టపడరు.*
నాకు ఒకవ్యక్తి తెలుసు. అతడు
చాలా దినములు ఆస్పత్రిలో ఉండెను. తినుటకు ఆహారముండినను తన అనారోగ్యమునుబట్టి అతడు ఆనందముగా భుజింప లేకపోయెను. అతడు
ఆకలి కోల్పోయిన స్థితిలో ఉండెను.
*చాలామంది ఆత్మీయ జీవితము జీవించుచున్నారుగాని వారిలోని పాపమును బట్టి ఆత్మీయ రుచిని కోల్పోయినవారై దేవుని వాక్యమును అనుభవించలేక పోవుచున్నారు*. దేవుని వాక్యములో పొరపాటు లేదుగాని వారిలోనే పొరపాటు ఉన్నది. కాబట్టి సమృద్ధి జీవము పొందినవారు దేవుని వాక్యమును అనుభవించుదురు; అది వారికి నిజమైన ఆత్మీయ ఆహారముగానుండును.
నిజముగా సమృద్ధి జీవమును పొందినవారు, క్రీస్తుయేసు నందు గల నిజ జీవితమును కనుగొనెదరు. చాలామంది క్రైస్తవులకు క్రీస్తునందు ఆనందము లేదు. వారు లోకానందముతో నిండియున్నారు గనుక
క్రీస్తునందుగల ఆనందమును కనుగొనలేకపోవుచున్నారు.
*ఇందువలన క్రీస్తునందు పొరపాటు ఉన్నదని తలంచరాదు; పొరపాటు వారిలోనే ఉన్నది!*
కొన్ని సంవత్సరముల క్రిందట నేను క్రైస్తవేతరునిగా జీవించితిని.
క్రీస్తును ద్వేషించుటవలన ఆయన శత్రువుగా నుంటిని. ఈ లోకసంబంధమైన వాటితో నా కోరికలను తృప్తి పరచుకొనుటకు ప్రయత్నించితిని గాని అవి తృప్తిపరచలేకపోయెను.
*లోకానుసారమైన యెన్నో నా ఇంట ఉండెనుగాని అవన్నియు నా ఆత్మను తృప్తిపరచలేకపోయెను. ఎందుకనగా మన హృదయము లోకానుసారమైన వాటితో సంతృప్తి చెందజాలదు*. మన హృదయమును
సృష్టించిన దేవుని వలననే అది తృప్తి పరచబడును. అవును, ఆయన మాత్రమే తృప్తి పరచగలడు!
*నేను క్రీస్తును నా సొంతరక్షకునిగా అంగీకరించినపుడు నా ఇంటిని, నా సొంత ప్రజలను, నా ప్రాంతమును విడిచి పెట్టవలసి వచ్చెను*.
అయితే
నేను సమస్తమును క్రీస్తునందు కనుగొంటిని. లోకము ఇవ్వలేని, లోకము తీసుకొనలేని ఆశ్చర్యకరమైన శాంతి, సమాధానములను నేను క్రీస్తునందు కనుగొంటిని.
నా స్నేహితులతో బసచేయుచు నేను వసతిగా జీవించినపుడు మాత్రము కాదుగాని శ్రమల మధ్యను నేను సమాధానమును కనుగొంటిని.
*నేపాల్ దేశమందు సువార్త ప్రకటించుటకు వెళ్ళిన దినమును నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అక్కడ ప్రజలు తమ మతమునకు వ్యతిరేకముగా నేను చెప్పునవి ఆలకించుటకు ఇష్టపడలేదు*. “మా రాజు
అనుమతి లేకుండా ఎలాగు నీవు ఇక్కడకు వచ్చితివి?” అని వారు అడిగిరి.
“మీ రాజు యొద్ద నేను అనుమతి పొందలేదన్న మాట నిజమేగాని రాజులకు రాజయొక్క అనుమతిని పొంది ఇక్కడకు వచ్చితిని” అని నేను జవాబిచ్చితిని.
*“అయితే మీ రాజు నిన్ను పంపినయెడల ఆయన నిన్ను ఎలాగు రక్షించునో చూద్దాం" అని చెప్పిన ఆ ప్రజలు నన్ను చెరశాలలో వేయించిరి*. చేతులు
కదల్చుటకు కూడా వీలు లేనంత గట్టిగా బిగించిరి.
అంతేకాదు, నా బట్టలన్నియు తీసివేసిరి. నేను పూర్తిగా దిగంబరిగా నుంటిని.
*అప్పుడు నా శరీరములోని రక్తమును పీల్చుటకు జలగలను నా మీద వేసిరి*. ప్రారంభములో అది ఎంతో బాధగా నుండెను. అర్ధగంట సమయము నేనెంతో వేదనను అనుభవించితిని. ఆ తర్వాత ఒక అద్భుతము
జరిగెను.
నా పరమ తండ్రి తక్షణము నాకు సహాయము చేయలేదుగాని ఒక ఆశ్చర్యకరమైన శక్తి నా మీదకు వచ్చెను. ఆయన మహిమగల ప్రసన్నత
చెరశాలను పరలోకముగా మార్చివేసెను.
*పాటలు పాడుట నాకు తెలియదు అయినను ఆ సమయమందు నేను మౌనముగా ఉండలేకపోతిని.* హింసల మధ్య స్తుతి కీర్తనలను పాడుట ప్రారంభించాను. అవి ఎంతో ఆశ్చర్యకరమైన కీర్తనలు!
*అప్పుడు వారు వచ్చి - నీ రాజు నీకు ఎలాగు సహాయము చేయగలిగెను? నీవు చెరశాలలోనుండగా నిన్ను రక్షించలేక పోయెను కదా? అని అడిగిరి.*
అయితే నేను, “ఆయన కృపను బట్టి నేను స్వతంత్రుడనైయున్నాను.
నా ఆత్మలో సమాధానము ఉన్నది. అట్టి సమాధానము మీకు లేదు" అనిజవాబు ఇచ్చాను.
*చెరశాలలో ఉండిన ఒక్క వ్యక్తి ఇంతకుమునుపే మార్కు సువార్తను చదివియుండెను. అతడు క్రీస్తునందుండిన జీవముగల శక్తిని గుర్తించి యుండెను*. చెరశాలను దేవుడు పరలోకముగా మార్చగలడని ఆ వ్యక్తి గ్రహించెను.
*ప్రజలు గవర్నర్ వద్దకు వెళ్ళి, “ఆ వ్యక్తిని చెరశాలలో బంధించుటవలన ఏమి ప్రయోజనము*? అతడు ప్రసంగించుచుండగా ఎవరూ పట్టించుకొన లేదుగాని ఇప్పుడు చెరశాలలో ఉంచబడిన తరువాత చాలామంది వచ్చి ఆయన మాట వినుచున్నారు" అని చెప్పిరి.
*అప్పుడు గవర్నర్, “అతనిని బైటకు పంపివేయండి. అతడు వెర్రివాడు” అని ఆజ్ఞాపించెను.*
అంతకుమునుపు సువార్త ప్రతిని చింపివేసిన వ్యక్తి వచ్చి - ఒక వెర్రివాడు అంత సంతోషముగా ఉండగలడా?
ఒకవేళ వెర్రివాడు అంత సంతోషముగా ఉంటే నేనుకూడ వెర్రివానిగా మారగోరుచున్నాను. అంతేకాదు, ఈ లోకమంతయు అలాగు మారవలెనని కోరుచున్నాను అని ప్రకటించెను.
*అతడు నా వద్దకు వచ్చి, “నన్ను క్షమించండి" అని బ్రతిమాలెను. అందుకునేను, "రక్షకుని యొద్దకు వెళ్ళండి; ఆయన మిమ్మును క్షమించును" అని వివరించితిని*.
తరువాత కాలమందు ఆ వ్యక్తి బాప్తిస్మము పొందెను. అతడు ఆశ్చర్యకరమైన సంతోషమును, సమాధానమును కనుగొనెను.
*ఎన్నో ఆశ్చర్యకరమైన అద్భుతములను నేను చూసినపుడు జీవముగల దేవుని ప్రేమను మరింతగా గుర్తించితిని. క్రైస్తవ దేశములందు జీవించు అనేకులు - అద్భుతములు కేవలము కట్టుకథలు అని చెప్పుచున్నారు.*
అద్భుతములను నమ్ముట లేదు. వారు గ్రహించలేక పోవుటయే దానికి కారణము. వారు అనుభవము లేనివారైయున్నారు గనుక గ్రహించుటలేదు.
*దక్షిణ ఇండియాలో చలివాతావరణములేదు. నేను టిబెట్టును గూర్చి వివరించుచూ నీటిమీద ఒక నీటి బ్రిడ్జిన్ను చూచిన విశేషమును అక్కడ వివరించితిని. అయితే ప్రజలు - అది అసాధ్యము, నీటిమీద నీటి బ్రిడ్జ్ ఎలాగు ఉంటుంది?* అని విస్మయము చెందిరి.
తీవ్రమైన చలి ప్రభావమువలన నదిలోని పైనీరు అంతయు ఐస్ గా మారినది అనియు అది నీటి మీద ఒక బ్రిడ్జి వలె ఉండినదనియు విశదపరచాను.
క్రింద నీరు; దాని పైన గడ్డగా మారిన బ్రిడ్జి వంటి ఐస్! ఈ విషయమును చలిదేశములయందు జీవించువారు నమ్ముదురు గాని మిగతావారు నమ్ముటకు సంశయించుదురు.
*పాపమందు జీవించు అనేకులు ఉన్నత పర్వతము ఎక్కజాలరు, నీటిమీద నీటి బ్రిడ్జ్ ఉన్నదనే వాస్తవాన్ని నమ్మజాలరు. అదే సమయమున ప్రార్థనాపరులైన వారు, చలిదేశమందున్నవారు నీటి బ్రిడ్జ్ ను గూర్చి చెప్పినపుడు నమ్ముచున్న ప్రకారము విశ్వసించెదరు.* అద్భుతములు జరుగుచున్నవా? అని కొందరు నన్ను ప్రశ్నించినపుడు, “అవును, నేను వాటిని అనుభవించుచున్నాను.
ప్రభువైన యేసుక్రీస్తు ఒక మహత్తర శక్తిగా ఉన్నాడు” అని జవాబిచ్చుచున్నాను.
రక్షకుడైన యేసుక్రీస్తుతో జీవించుట ద్వారా ఆత్మసంబంధమైన అనుభవములు పొందుటకు మనకు ఒక అవకాశము ఇవ్వబడుచున్నది.
*మనము సినిమా థియేటర్ లోనికి వెళ్ళి ఆశ్చర్యకరమైన సంగతులను చూడలేము. దేవుని ఆశ్చర్యకరమైన సంగతులను చూడగోరిన యెడల ప్రార్థనయందు సమయమును వెచ్చించవలెను.* నీ కుతూహలమును తృప్తి పరచుటకు కాదు, ఆత్మను తృప్తి పరచుటకు ప్రభువు అద్భుతమును జరిగించును.
*ఆశీర్వదించబడిన ప్రభువు పాదసన్నిధానములో మనము కూర్చొన్నపుడు మన ప్రాణము తృప్తిచెందును.* ప్రతిదినము కనీసము 20 నిమిషములు మనము
ఆయన సన్నిధిలో బైబిల్ చదివి ప్రార్థించవలెను. నేను ఆ అనుభవమును కలిగియున్నాను.
*మీరు ఆయనను ఎరిగినవారై ఆయన చిత్తానుసారముగ సమస్తమును చేసినయెడల ధన్యులగుదురు. మన రక్షకుడు తన వాక్యము ద్వారా మీతో మాట్లాడుచున్నాడు. ఆయన సమృద్ధి జీవమునిచ్చుటకు వచ్చెను. దానియందు సమాధానము సంతోషము గలదు.* సమృద్ధి జీవములేనివారు జీవశ్చవము వలె ఉన్నారు.
*మన పాపము, పాపపుస్థితిని గ్రహించుటకు ఆశీర్వదించబడిన ఆయన పాదముల చెంతచేరి సమృద్ధి జీవమును అడుగుటకు ప్రభువు సహాయము చేయును గాక!*
ఇహమందు సమృద్ధి జీవమును, పరమందు ఆయన నిత్య నివాసమును చేరి ఆయనను ముఖాముఖిగా దర్శించు ధన్యతను ప్రభువు
అనుగ్రహించునుగాక!
ఇప్పుడు మనకు భాష సమస్య ఉన్నదిగాని అక్కడ భాష సమస్య ఉండదు.
ఆశీర్వదించబడిన ఆ దేశమందు మనమందరము కలుసుకొందుము.
నిన్నటి దినము నేను చెప్పిన ప్రకారము మనము స్విస్ వారమైనను ఇంగ్లీషువారమైనను హైందవులమైనను అక్కడ క్రీస్తు యేసునందు ఒకే దేశముగానుందుము.
*జీవమును, సమృద్ధి జీవమును పొందుటకు ఇక్కడను సదా అక్కడను జీవించుటకు దేవుడు తానే సహాయము చేయునుగాక!*
ఈ ప్రసంగము
*సాధు సుందర్ సింగ్ గారు స్విట్జర్లాండ్ లో చెప్పిన ప్రసంగములు అను పుస్తకములోనిది...*
పేజీ నెం. 5-15
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి