అంశం) ఏమి వెదకుచున్నావు?
🎯🎯🎯🎯🎯🎯🎯
“రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బేల్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి . - యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి” (మత్తయి 2:1,2).
దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని దీవించి, యూదా గోత్రాన్ని ఆశీర్వదించెను. వారు రాజు కొరకు అడిగినప్పుడు, సౌలును ఏర్పరచెను. తరువాత దావీదును, సొలొమోనును వారికిచ్చెను. ఆ తరువాత ముప్పై తొమ్మిది మంది రాజులు యూదా రాజ్యమును, ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించిరి గాని; వారు విఫలులైనందున దేవుని జనాంగము విచ్ఛిన్నమై, అన్యుల పరిపాలన క్రింద అల్లాడుచు; విడిపించి, విమోచించగలిగిన రాజు కొరకు, ప్రవచనాల నెరవేర్పుగా రానైయున్న మెస్సీయ కొరకు ఎదురుచూచు దినములవి! బహు కూరుడు, మూర్ఖుడునైన హేరోదు యెరూషలేమును పరిపాలించే దినములవి!
ఆ పరిస్థితులలో నక్షత్రముచేత నడిపించబడిన జ్ఞానులు యెరూషలేమును చేరిరి. వారు హేరోదు యొద్దకు వచ్చి - 'యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ?” అని అడిగిరి. ఆ ప్రశ్నకు కలవరపడిన హేరోదు శాస్త్రులను పిలిపించి - 'క్రీస్తు ఎక్కడ పుట్టునని' వారి నడిగెను. ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగిన ఆ పండితులు ప్రవక్తల ద్వారా వ్రాయబడిన ప్రవచనాలను గుర్తించి; దావీదు కుమారునిగా, యూదుల రాజుగా యేసుక్రీస్తు యూదయ దేశపు బేల్లెహేములో జన్మించునన్న సంగతి తెలియజేసిరి (మత్తయి 2:2-5).
ఎంత ఆశ్చర్యము! క్రీస్తు పుట్టుకను, ఆయన జన్మస్థలమును, ఆయన పరిపాలనా బలమును ధర్మశాస్త్రములో అనేకసార్లు చదివినప్పటికి; ఆనాటి ప్రజలు ఆయనను గుర్తించకపోవుట, ఆయనను కనుగొనటానికి ఆశించక పోవుట ఎంత విచారం! అయితే ఆ జ్ఞానులు తూర్పు దేశముల నుండి అనగా పర్షియా లేక బబులోను అనబడే అన్య దేశాల నుండి బయలుదేరి, ఎంతో దూరం ప్రయాణం చేసి; నిజమైన, నిరంతరమైన రాజును కనుగొనాలని వచ్చిరి. కాని అక్కడే ఉన్న యూదులు 'ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారాయనను అంగీకరింప లేదన్నట్లు' (యోహాను 1:11), బేల్లెహేములో జన్మించిన క్రీస్తును చూచుటకైనను, ఆరాధించుటకైనను ఆసక్తి లేనివారిగా ఉండిరి.
అయితే ఈ జ్ఞానులు అన్యులైనప్పటికి, ధనవంతులైనప్పటికీ; ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసి, ప్రవచనాలను గుర్తించి, అష్కూరు, బబులోను దేశాలలోచెరపట్టబడి, బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను, యూదులను విడిపించుటకు మెస్సీయ రానైయున్నాడని గుర్తించి; గొప్ప నమ్మికతో, ఆసక్తితో వారు క్రీస్తును కనుగొని ఆయన యెదుట సాగిలపడుటకు వచ్చిరి.
“తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, ఆయనను పూజింపవచ్చితిమనిరి"(మత్తయి 2:1). “నక్షత్రము యాకోబులో ఉదయించును; రాజ దండము ఇశ్రాయేలులో నుండి లేచును” అని సంఖ్యాకాండము 24:17లో ఉన్న నక్షత్రము ఈ క్రీస్తేనని గుర్తించారు. ఆకాశములోని నక్షత్రాన్ని గుర్తించి, ఇంచుమించు వెయ్యి మైళ్ళ దూరాన్ని ఎన్నో క్లిష్ట పరిస్థితులలో ప్రయాణం చేసి, యెరూషలేముకు చేరిరి. అయితే ఆనాటి ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు క్రీస్తు బెల్లెహేములో పుట్టునని ఎరిగినప్పటికి; యెరూషలేముకు నాలుగైదు మైళ్ళ దూరంలో ఉన్న బేల్లె హేముకు వెళ్లి, క్రీస్తును చూచి ఆరాధించలేకపోయిరి.
దీనిని బట్టి మనమెంతగా బైబిలు సంగతులు తెలుసుకొన్నా, క్రీస్తును గురించి మనమెంత చదివినా, ఎన్ని వాక్యాలు కంఠతః పట్టినా; ఆ సత్యాన్ని హృదయానికి అన్వయించుకొని, మనలను మనము ఆయనకు అప్పగించుకొని, ఆయన యెదుట సాగిలపడకపోతే మన భక్తంతా వ్యర్థమే అని తెలియుచున్నది. హేరోదు ఇక్కడ ఎంతో భక్తిపరుడుగా కనిపిస్తున్నాడు. శాస్త్రులను పిలిపించి, ధర్మశాస్త్రాన్ని చదివించుకొంటున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో తెలుసుకో గోరుతున్నాడు. ఆ జ్ఞానులతో మీరు వెళ్లి చూచి, నాకు వర్తమానము పంపండి; నేనును వచ్చి ఆయనను పూజిస్తాను అంటున్నాడు (మత్తయి 2:8). ఇదంతా మాటల భక్తియే గాని, అతని హృదయం తంత్రములతో నిండియున్నది. ఈనాడనేకులు దేవుని వాక్యములో ఉన్న సంగతులన్నీ తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. పాత నిబంధన ప్రవచనాలను గురించి, పరిశుద్ధాత్ముని వరాలను గురించి, యేసుప్రభువు రాకడను గురించి సవిస్తరణగా తెలుసుకోవాలని
ఆశిస్తున్నారు. ఆ అంశాలపై వ్యర్థమైన వాగ్వాదాలకు దిగుతున్నారే గాని; ఆయన వచ్చినప్పుడు ఆయనను సంధించుటకు, ఆయనతో ఎత్తబడుటకు సిద్ధపడకున్నారు.
ఆనాడు జ్ఞానులు బాలయేసును చూచి, సంపూర్ణ సత్యాన్ని గ్రహించారు. అయితే ఈనాడు మనం పరిపూర్ణుడైన క్రీస్తును గురించి గత రెండువేల సంవత్సరాలుగా దేవుని వాక్యములో చదువుతున్నాము, వింటున్నాము; ఆయన పరిశుద్ధాత్మ కార్యాలను, ఫలితాలను చూస్తున్నాము! అయినను ఆయన యెదుట సాగిలపడి మనలను మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోకపోవటం ఎంత విచారం!
కనీసం ఇప్పుడైనా క్రీస్తును మన జీవితాలలో రాజుగా ప్రతిష్టించుకొని ఆయన ఆజ్ఞానుసారంగా మన శేష జీవితాన్ని జీవిద్దాం! ఆయన రాజ్య సువార్తను మరింత ముమ్మరంగా ప్రకటిద్దాం! ఆమేన్! -
యన్. జయపాల్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి