✳ *క్రిస్మస్ సందేశాలు* ✳
(25 వ భాగము )
*ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా*
(అన్నా ప్రవక్తి – మూడవ భాగం)
(లూకా 2:36 మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను.)
*8. అన్నా ఆషేరు గోత్రీకురాలు:* “ఆషేరు” అను మాటకు అర్ధము *భాగ్యము.* క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి వారు ఎంతో భాగ్యవంతులుగా ఉన్నారు. అన్నా అను ఈ ప్రవక్తి, మెస్సియాగా ఈ లోకానికి వచ్చిన యేసునందు విశ్వాసముంచినది గనుక ఆమె ఎంతో *భాగ్యవంతురాలు*.
"ఆషేరు" యాకోబు యొక్క తొమ్మిదవ కుమారుడు. ఆషేరు యెద్ద శ్రేష్టమైన ఆహారము కలదని యాకోబు ప్రవచించాడు. ఆది.కా 30:12.
ఆ శ్రేష్టమైన ఆహారమే దేవుని వాక్యమే. అనుదినం ఎవరైతే దేవుని వాక్యం భుజిస్తారో వారే నిత్యం భాగ్యవంతులుగా ఉండగలరు.
(యాకోబు 2:5 నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను...)
(నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును *భాగ్యవంతులు*." 1 రాజులు 10:8 )
ప్రభువు యొక్క తలంపులకు, ఆయన ప్రణాళికలకు అనుగుణంగా *అన్నా* మాదిరిగా మనం కూడా జీవిస్తుంటే మన కంటే భాగ్యవంతులు ఈ భూమిపై ఎవరూ ఉండరు.
*9. అన్నా పనూయేలు కుమార్తె:* పనూయేలు అనగా దేవుని ముఖాముఖిగా చూచిన స్థలం. యాకోబు మోకాళ్ళ ప్రార్ధన అనుభవాన్ని పోరాటాన్ని మనకు తెలియజేయుచున్న స్థలం.
ప్రార్ధనలో పోరాడిన యాకోబు దేవుని ముఖదర్శనం చేయగలిగాడు. దేవుని వాక్యమే దేవునియొక్క ముఖం. *వాక్యము దేవుడై యుండెను.* యోహాను 1:1.
మోషే కూడా ఆ దేవాది దేవుని ముఖాముఖి చూడాలి అన్నపుడు, దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నపుడు ఆ దేవుడు మోషేకి తననుతాను బయలు పరచుకున్నారు. కారణం మోషే యొక్క యథార్థత.
మండుచున్న పొదయెదుట తన జీవితాన్ని యథార్థంగా దేవునికి సమర్పించినాడు మోషే. "యథార్థవంతులు ఆయన *ముఖదర్శనం* చేసెదరు." కీర్తన 11:7. దేవుని ముఖం చూడకుండానే దేవునిని ముఖాముఖిగా తెలుసున్న వ్యక్తిగా మోషే మారిన సందర్బం అది. అది ఒక అద్భుతం.
దేవుడు తన ముఖాన్ని మోషేకి చూపించలేదు కానీ తన మంచితన్నాన్ని మోషేకి చూపించారు. తన మహిమను మోషేకి చూపించారు. (నిర్గామ 33:18-23).
ఎప్పుడైతే వాక్యం ద్వారా నీతిమంతులుగా మార్చబడుదురో వారే దేవుని ముఖదర్శనం చేయుదురు. "నేనైతే నీతిగలవాడనై నీ *ముఖదర్శనం* చేసెదను." కీర్తన 17:15.
అన్నా గొప్ప ప్రార్ధనా పరురాలు. రేయింబవలు మోకాళ్ళ ప్రార్ధనా అనుభవం గలిగిన భక్తురాలు. అందుకే దేవాలయంలో యేసు నాధుని ముఖ దర్శనం చేయగలిగినది.
*10. అన్నా దీర్ఘాయుష్షు చేత దీవించబడినది:* (లూకా 2:37 యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలై యుండి,) అన్నా వయస్సు 100 సంవత్సరాల పైనే ఉన్నది. ఒక్కసారి ఆమె వయస్సు లెక్క చూస్తే, షుమారుగా 19 సంవత్సరాలకు వివాహం అయితే 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసింది. భర్త చనిపోయి అనాధ అయినా ఏకాకిగానే యుండి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవుని మీద ఆధారపడి దేవుని యందు ఎంతో భయభక్తులతో జీవించినది.
యెహోవా యందు భయ భక్తులే దీర్ఘాయువునకు మూలం. ఆమె వయస్సు లెక్క చూస్తే దాదాపు 110 సంవత్సరాలు. జీవితంలో కాలం గడిచేకొద్దీ అనుభవం వస్తుంది. (యోబు 12:12) అయితే మరోవైపు, ఆధ్యాత్మిక పురోగతి వయసుతోపాటు యాంత్రికంగా రాదు. అందువల్ల, కేవలం గతంలో సంపాదించుకున్న జ్ఞానసంపదపై ఆధారపడే బదులు, దేవుని బిడ్డలు సంవత్సరాలు గడిచేకొద్దీ “జ్ఞానాభివృద్ధి” చేసుకోవడానికి అన్నా మాదిరి కృషి చేయాలి.
యెహోవా మోషేకు పని అప్పగించినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. (నిర్గమకాండము 7:7 వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు..)
ఆ కాలంలో ఆ వయసు వరకు జీవించడం అసాధారణ విషయంగానే పరిగణించ బడిందనేది స్పష్టం, ఎందుకంటే ఆయనిలా వ్రాశాడు: “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు. అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములు అగును.” (కీర్తన 90:10)
అయినా, నేర్చుకునేందుకు తాను వృద్ధుడనని మోషే ఎన్నడూ తలంచలేదు. మోషే అనేక దశాబ్దాల దేవుని సేవలో, ఎన్నో ఆధిక్యతలు ఆనందిస్తూ, బరువైన బాధ్యతలను మోస్తున్నా, యెహోవాను ఇలా వేడుకున్నాడు: “దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును.” (నిర్గమకాండము 33:13)
ప్రభువుతో తన సంబంధం ఎల్లవేళలా ఎదుగుతూ ఉండాలని మోషే సదా కోరుకున్నాడు. అదేవిధంగా
అన్నా కూడా తన జీవితమంతా దేవాలయంలో దేవుని సన్నిధికి అంకితం చేసిన గొప్ప ఘనురాలు.
ఈ లోకంలో ఆన్నిటికన్నా దేవుని సన్నిధియే మిన్న అని గ్రహించిన ధన్యురాలు *అన్నా* మనకు ఎంతో మాదిరికరం.
కీర్తన 96:6 ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి. కొలస్సి 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములై యున్నవి.
తన జీవితాంతం దేవుని సేవించి ప్రభు ముఖ దర్శనం చేసిన *అన్నా* వలే మనంకూడా ప్రభువును సేవించి ధన్యులమగుదము గాక! ఆమెన్!!
(సమాప్తం)
దైవాశ్శీసులు
From the desk of...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి