✳ *"త్యాగం", "విధేయతల" సంగమమే “ క్రిస్మస్”* ✳
వేసవి సెలవుల విరామ సమయం తర్వాత స్కూల్స్ మరలా ప్రారంభమయ్యాయి. నూతనంగా చేరిన విద్యార్థులను టీచర్ పరిచయంచేసుకొనే వాటిలో భాగంగా, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ, మీ డాడీ ఏమి చేస్తుంటారు అంటూ ప్రశ్నిస్తే, దానికి సమధానంగా డాక్టర్, టీచర్ ...అంటూ పిల్లలు ఉత్సాహంగా సమాధానము చెప్తున్నారు. అయితే, ఒక అబ్బాయికి వాళ్ళ డాడీ ఏమి చేస్తారో తెలియక ఏడ్వడం ప్రారంభించాడు. రేపు వచ్చేటప్పుడు తెలుసుకొనిరా అంటూ టీచర్ వాడిని సముదాయించింది.
ఆ రోజు స్కూల్ నుండి వాడు ఇంటికి వెళ్ళాడు. స్కూల్ బ్యాగ్ కూడా క్రింద పెట్టకుండానే, డాడీ మీరేమి చేస్తారంటూ అడగడం మొదలుపెట్టాడు. దానికి వాళ్ళ డాడీ రేపు నీకు స్కూల్ కి సెలవు కదా, నేను పనిచేసేచోటకి తీసుకొని వెళ్లి చూపిస్తానని చెప్పి, తర్వాత రోజు తీసుకొని వెళ్ళాడు.
ఒక నది మీద బ్రిడ్జి ఉంటుంది, అది రెండుగా విడిపోతే, దానిలో బోట్స్ ప్రయాణిస్తాయి, లేకపోతే బ్రిడ్జి కలసివుంటే, దాని మీద ట్రైన్స్ ప్రయాణిస్తాయి. ఆ బ్రిడ్జిని ఆపరేట్ చేసే వర్క్ వీళ్ళ డాడీ చేస్తారు. ఆయనేదో ఆఫీస్ వర్క్ చేసుకొంటున్నారు, పిల్లాడు ప్రక్క రూములో ఆడుకొంటున్నాడు. ఈ లోపు ఆయనకు, త్వరలో ట్రైన్ రాబోతుంది బ్రిడ్జిని కనెక్ట్ చేయమంటూ ఫోన్ కాల్ వచ్చింది, అతను ఇంకా టైం ఉందిలే అనుకొంటూ, తడవు చేసి, చివరి నిమిషంలో ప్రక్క రూమ్ కి వెళ్ళాడు. తాను ఆపరేట్ చేసే మెషెన్ దానిలోనే వుంది. ఈలోపు హాయ్ డాడీ! అంటూ పలకరింపు. వీడెక్కడున్నాడురా అంటూ చూస్తే, ఆ మెషెన్ పైన కూర్చొని వున్నాడు. తండ్రి గుండె పగిలినంత పనయ్యింది. వాడికి క్రిందకి దిగడం తెలియదు. అంత సమయమూ లేదు. ఈ పరిస్థితులలో స్విచ్ ఆన్ చేస్తే? తన ఏకైక కుమారుడు చనిపోతాడు. ఆన్ చెయ్యకపోతే, ఆ ట్రైన్ వచ్చి నదిలో పడిపోతుంది. వేలాదిగా చనిపోతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే అతని ముందున్నాయి.
గుండెల్లో వర్ణనాతీతంగా దుఃఖాన్ని నింపుకొని, సారి నాన్నా! అంటూ కళ్ళుమూసుకొని, స్విచ్ ఆన్ చేసేసాడు. డాడీ! అంటూ ఒకే ఒక్క పెద్ద కేక. కొన్ని క్షణాలకు ఎముకలు పట పట మంటూ, మెషెన్ మధ్యలో పడి, నలిగిపోతున్న శబ్దం. గోడలన్నీ
రక్త సిక్తం. మరికొద్ది సేపటికి, చిన్న చిన్న మాంసపు ముక్కలు తన కాళ్ళ మీద పడుతున్న అనుభవం. మరికొంత సేపటికి, ఒక పెద్ద మాంసపు ముద్ద మెషెన్ నుండి పడింది. అటువైపు చూస్తే, బ్రిడ్జి మీద కోలాహలంగా, వేగంగా దూసుకుపోతుంది ట్రైన్. వారి సంతోషం వెనుక ఒక తండ్రి త్యాగముందని వారికేమి తెలుసు? ఏకైక కుమారునికి కోల్పోయినా, ఆ ట్రైన్ ను రక్షించగలిగాను అనే సంతృప్తి ఆ తండ్రి త్యాగంలో వుంది.
రెండువేల సంవత్సరాల క్రితం కూడా ఇదే పరిస్థితి. సర్వ మానవాళి, నిత్యనాశనం వైపు దూసుకుపోతుంది. అట్లాంటి పరిస్థితిలో సర్వ మానవాళిని నిత్యనాశనానికి అప్పగించాలా? లేక తన ప్రియమైన ఏకైక కుమారుని త్యాగం చేసి, వారిని నిత్య జీవంలోనికి దాటించాలా? అనే రెండు ప్రశ్నలు తండ్రి ముందు నిలబడి వున్నప్పుడు, ఆ తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నాడో, ఈ పరమ తండ్రి కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. అట్లాంటి సంతృప్తినే అనుభవించగలిగాడు. ఆ తండ్రి త్యాగం భౌతికంగా కొందరి ప్రాణాలను మాత్రమే రక్షించగలిగింది. కానీ, పరమ తండ్రి త్యాగం సర్వ మానవాళిని, నిత్య మరణం నుండి నిత్య జీవంలోనికి నడిపించడానికి మార్గం సిద్ధం చేసింది.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. (యోహాను 3:16)
మనలను నిత్య జీవంలోనికి చేర్చడానికి తండ్రి త్యాగముతో పాటు, కుమారుని విధేయత మిళితమై వున్నాయి. ఈ త్యాగానికి, విధేయతకు మనకున్న అర్హత ఏదైనా ఉందా అంటే? లేనే లేదు. ఇంతకీ, ఈ త్యాగం, విధేయత మనము ఎట్లాంటి పరిస్థితులలో వున్నప్పుడు జరిగిందో తెలుసా? మనము బలహీనులమై యున్నప్పుడు(రోమా 5:6) మనము పాపులమై యున్నప్పుడు ( రోమా 5:8 )మనము శత్రువులమై యున్నప్పుడు (రోమా 5:10). అంతేగాని, మనకున్న పరిశుద్ధత, నీతిని బట్టి ఎంత మాత్రం కానే కాదు.
ఇంతకీ, తండ్రి త్యాగం, కుమారుని విధేయత మనకు తీసుకొచ్చిన ప్రయోజనాలేంటి? అనాది కాలంగా మనిషి చేస్తున్న ప్రార్థనకు సమాధానాన్ని తీసుకొచ్చాయి. “అసతోమా సద్గమయః, తమషోమా జ్యోతీర్మయః, మృత్యోర్మా అమృతాంగమయః” ఆంటే? అసత్యములోనున్నాను సత్యములోనికి నడిపించు. అంధకారంలోనున్నాను వెలుగులోనికి నడిపించు. మరణంలోనున్నాను జీవంలోనికి నడిపించు.
సత్యములోనికి నడిపించాలంటే సత్యమైయున్నవాడు కావాలి. వెలుగు లోనికి నడిపించాలంటే? వెలుగైయున్నవాడు కావాలి. జీవములోనికి నడిపించాలంటే? జీవమై యున్నవాడు కావాలి. సత్యమైయున్నవాడు, వెలుగైయున్నవాడు, జీవమైయున్నవాడు, ఈలోకంలో ఎవ్వరూ లేనే లేరు. ఒక్క క్రీస్తు తప్ప. ఇది క్రీస్తుతోనే, క్రిస్మస్ తోనే సాధ్యమయ్యింది.
*క్రిస్మస్ ఆంటే?*
🔹“సత్యము” శరీరధారిగా లోకానికి ఏతెంచిన శుభసందర్భం: ఆయనే సత్యం ( యోహాను 14:6) ఆయన వాక్యమే సత్యం ( యోహాను 17:17)
🔹“వెలుగు” లోకానికి ప్రత్యక్షమైన శుభసందర్భం:
ఆయనే వెలుగు ( 1యోహాను 1:5)
🔹“జీవము” లోకానికి ప్రత్యక్షమైన శుభసందర్భం:
ఆయనే జీవం (యోహాను 14:6)
ఇంతకీ, నీవు చేసే క్రైస్ట్ మాస్ లో, క్రైస్ట్ మిస్ అయిపోతున్నాడా? ఇంటిపైన స్టార్, ఇంట్లో బార్ లా సాగుతుందా నీ క్రిస్మస్ ఆరాధన? సత్యం లోకానికి ఏతెంచినా అసత్యములోనే జీవిస్తున్నావా? వెలుగు లోకంలో ప్రత్యక్షమైనా అంధకారంలోనే కొట్టిమిట్టాడుతున్నావా? జీవం ప్రత్యక్షమైనా మృత్యుకోరల్లో నలిగిపోతున్నావా? ఆంటే? ఆ పరమ తండ్రి త్యాగం, తన కుమారుని విధేయత నేటికిని నీకర్ధం కాలేదన్నమాట? సంవత్సరాలు నీజీవితంలో దొర్లిపోతున్నాయి. నేటికిని నీకర్ధం కాకపొతే? నీ జీవితం వ్యర్థం. నటించిన నీ జీవితానికి గతించిన కాలమే చాలు. నేడైనా నీ హృదయంలో ఆయనను చేర్చుకో. నిజ క్రిస్మస్ ను ఆరాధించు. నీ జీవితం ధన్యమవుతుంది.
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి