✳ *క్రిస్మస్ సందేశాలు* ✳
(28 వ భాగము )
*దావీదు నీతి చిగురు*
(యెష్షయి మొద్దు చిగురు – ౩వ భాగం)
(యెషయా 11:1 యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును.
*4. దావీదు నీతి చిగురు:* యేసే దావీదుకు నీతి చిగురు అనే విషయాన్ని యిర్మియా కూడా బలంగా తెలియజెప్పాడు.
యిర్మియా 23:5 యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. రాబోవు దినములలో నేను *దావీదునకు నీతి చిగురును పుట్టించెదను*; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును
యిర్మియా 33:15 ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.
యేసు దావీదుకు నీతి చిగురు గనుక మనలను నీతిమంతులుగా చేయుటకే ఆయన ఈలోకానికి వచ్చినాడు. (1 కొరి 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను) దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయుటకే, ఆయన దావీదుకు నీతి చిగురుగా జన్మించెను. 1 యోహాను 1:9 ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన నీతి చిగురు గనుక పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతుకు సలహా ఇచ్చెను. ఆయన నీతిగూర్చి సర్వలోకము ప్రకటించుచున్నది. మరి మనము ఆయన నీతిని ప్రకటిస్తున్నామా?
*5. యూదా గోత్రపు సింహముగా చిగురు:* (ప్రకటన 5:5 ఆ పెద్దలలో ఒకడుఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.) యూదా కొదమసింహము గాబట్టియే యూదా సంతతిలోనే రాజ సింహముగా దావీదును చక్రవర్తిగా చేశాడు. యూదా గోత్రములోనివాడు దావీదు. అతని సంతతిలోనే రక్షకుడు ఉదయించాడు. యూదా అను కొదమసింహము గర్భములో యూదా గోత్రపు సింహము జన్మించుటలో ఆశ్చర్యమేముంది? సింహము కడుపులో సింహమే పుడుతుంది. గర్జించు సింహమైన సాతానును జయించుటకె యూదా గోత్రపు సింహమిన యేసు దావీదుకు చిగురుగా జన్మించాడు.
యూదా గోత్రపు సింహమైన యేసు సాతానును జయించి తండ్రితోకూడా యేసు సింహాసనంమీద కూర్చుని ఉన్నట్టే, దావీదు గోత్రపు సింహము యేసు ద్వారా మనం రక్షణ పొందుకుని జయించే వారముగా ఉన్నచో మనలను కూడా ఆయనతోకూడా సింహాసనం మీద కూర్చోనిస్తాడు.
ప్రకటన 3:21 నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
*6. పరిశుద్ధమైన చిగురు:* యేసు పరిశుద్ధమైన చిగురుగా జన్మించాడు. (యెషయా 6:13 దానిలో పదియవ భాగము మాత్రము విడువ బడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును; అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.)
యేసు పరిశుద్ధుడు, సమస్త నైతిక అపవిత్రత మరియు ద్వేషమునకు అతీతుడు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.’ (ప్రకటన 4:8) బైబిలు ఈ మాటలతో యెహోవా పరిశుద్ధుడనీ అ౦టే ఆయన పవిత్రుడనీ, నిర్మలమైనవాడనీ, ఈ విషయంలో మరెవరూ ఆయనకు సాటిరాలేరనీ వివరిస్తోంది. దేవుడు పాపరహితుడు; పాపం ఆయనను ఏ విధంగానూ మలినపరచలేదు. ఆయన పరిశుద్దుడు గనుక మనం కూడా పరిశుద్దులుగా ఉండాలి. పరిశుద్ధత గురించి యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞ, ఆయన ఆలోచనా విధానం గురించి, మార్గాల గురించి మనకు ఎంతో విలువైన విషయాలను తెలియజేస్తుంది. ఒక విషయమేమిటంటే, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగివుండాలంటే, పరిశుద్ధ ప్రవర్తన విషయంలో ఆయన ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి శాయశక్తులా కృషి చేయాలని తెలుసుకుంటాం. (1 పేతురు 1:14-16)
ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నప్పుడు, మనం సాధ్యమైనంత మంచి జీవితాన్ని జీవిస్తాం.—యెషయా 48:17.
*7. దేవుని మహిమగా చిగురు:* యేసు క్రీస్తు దేవుని మహిమగా ఈ లోకానికి దిగివచ్చాడు. ప్రభువు ఈలోకంలో జన్మించినప్పుడు పరలోక మహిమ దిగివచ్చినది. దూత గణము ఎంతో మధురమైన గీతములతో *సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ* అని ఆరాధించినారు. కారణం ఆయన మహిమ స్వరూపుడు. (యెషయా 4:2 ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష ణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.) దావీదు చిగురుగా యేసు పుట్టుక *దేవునికి గొప్ప మహిమను* చేకూర్చేదని మనం గమనించాలి. యేసు వచ్చినది ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే. అలనాడు దేవుని మహిమ ఇశ్రాయేలీయుల మీదికి దిగి వచ్చెను. (నిర్గ 16:10 అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను) ఇదే షెకీనా మేఘము. షెకీనా అనగా దిగివచ్చుట. (యోహాను 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద *నిన్ను మహిమ పరచితిని*). వునికి మహిమ కలిగించుటకే యేసు ఈ లోకానికి వచ్చాడు. కారణం దేవునికి రావలసిన మహిమ సాతాను తనకు అపాదించుకొంటూ సర్వమానవులను రకరకాల విగ్రహారాధనతో మోసం చేస్తున్నాడు.
(యెషయా 42:8 యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని *నా మహిమను నేనిచ్చువాడను కాను* నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.) కనుక యేసు ఈ లోకానికి వచ్చి తన జీవితం ద్వారా అద్భుతమైన రీతిగా దేవునికి మహిమను కలిగించాడు. క్రీస్తును పోలి, దేవుని బిడ్డలమైన మనం కూడా ఏ పని చేసినా దాని యొక్క అత్యున్నతమైన ఉద్దేశం *దేవునికి మహిమ* కలగడమేనని గ్రహించాలి. విశ్వాసి ప్రవర్తన అంతటినీ ఏలవలసిన గొప్ప నియమం ఇది.
కాబట్టి యేసే యెష్షయి మొద్దుకు పుట్టిన చిగురని, దావీదు యొక్క నీతి చిగురుగా జన్మించినవాడని తెలియుచున్నది. అందుకే ఆయన రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభువు. ఈ బిరుదు ఆయనే ఈ లోక సార్వభౌముడని ఋజువు చేస్తున్నది. కాబట్టి దావీదుకు చిగురుగా జన్మించిన యేసును హృదయపూర్వకంగా మనం కూడా సేవించి ధన్యులమగుదము గాక! ఆమెన్!!
(సమాప్తం)
దైవాశ్శీసులు
- పాస్టర్ జ్యోతిరాజు వేముల
ప్రిన్సిపాల్
ఇమ్మానుయేల్ బైబిల్ కాలేజి
నిడుబ్రోలు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి