ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అన్నా ప్రవక్తి. 1 నుంచి 4 వరకు భాగములు

✳ *అన్నా ప్రవక్తి* ✳

 (మొదటి భాగము)

లూకా 2:38 ఆమెకూడ ఆ గడియలోనే  లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను  గూర్చి మాటలాడుచుండెను.

సుమెయోను మరియు అన్నా ఇశ్రాయేలుకు మెస్సీయ వచ్చేటప్పుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇశ్రాయేలులో మెస్సీయ వచ్చాడని వారు గుర్తించారు. పరిశుద్ధ గ్రంధంలో అన్నాను గురించి కొంచెమే వ్రాయబడినది. అదైనా లూకా మాత్రమే అన్నాను గురించి వ్రాశాడు. 

అయినా ఆమె జీవితం ఆమె పరిచర్య ఎంతో మనకు  ఆదర్శం, దేవుని పరిశుద్ధ గ్రంధంలో వెలుగులోనికిరాని అనేకమంది వినయ విధేయతలు దైవభక్తి మరియు గొప్ప పరిచర్య చేసిన నాయకులు సేవకుల్లాగే, ఆమె కూడా గుర్తించబడలేదు. కానీ ఆమె ఇజ్రాయెల్ లో ఒక గొప్ప శక్తివంతురాలుగా ఉన్నది. అన్నా ప్రవక్తిగురించి కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం.

*1. అన్నా దేవునికి సాక్షిగా ఉన్నది:* అన్నా కూడ ఆ గడియలోనే  లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను  గూర్చి మాటలాడుచుండెను. 

ఇక్కడ అన్నా ప్రవక్తి యేసును గూర్చి ఏమి మాటలాడు చుండెను? ఈ ఘటన ద్వారా మలాకీ 3: 1-5 యొక్క ప్రవచనాన్ని నెరవేర్చబడినది. 

(మలాకీ 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, *తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును;* ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.) 

దేవుడు ఇశ్రాయేలులో మెస్సీయను ధృవీకరించడానికి దైవభక్తిగల మనిషిగా మరియు దైవిక స్త్రీ యొక్క సాక్ష్యాన్ని కోరుకున్నాడు. అదే సమయంలో అన్నా అక్కడకు వచ్చి ఇశ్రాయేలు కొరకు వచ్చిన మెస్సియా ఈ బాలుడేనని అన్నా చెప్పిన సాక్ష్యమే దేవాలయంలో ఆమె యొక్క మాటలు.

*2. అన్నా మరియు సుమెయోను ద్వారా యేసే మెస్సియా అనే సంగతి ధృవ పరచబడినది:* ఎందుకు దేవుడు ఒకే సమయంలో సిమియోను మరియు అన్నా ప్రవక్తిలను దేవాలయమునకు రప్పించాడు? దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. 

ఏదైనా ఒక విషయాన్ని ధర్మశాస్త్రం ప్రకారం ధ్రువీకరించాలంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల నోటి ద్వారా విషయం నిర్ణయించ బడుతుంది. 

అందువలన ధర్మశాస్త్రం నిబంధన నెరవేరునట్లు, సుమెయోను మరియు అన్నా ప్రవక్తి ద్వారా దేవుడు యేసే మెస్సియా అని సాక్ష్యం చెప్పించాడు. 

(ద్వితీయోపదేశకాండము 19:15  ... ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింప కూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును). 

అపోస్తలుడైన పౌలు కొరింథు సంఘమునకు వ్రాసినప్పుడు అదే భావనను పౌలు ధృవీకరించాడు, II కొరింథీయులకు 13: 1 ... "ఈ మూడవ సారి నేను మీయొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచ బడవలెను." 

మెస్సీయ రాకను ధృవీకరించడానికి దేవుడు సుమెయోను మరియు అన్నాలను ఎన్నుకున్నాడు. భక్తులైన పురుషులను మరియు భక్తులైన మహిళలను ప్రభువు నేడు తన పని నిర్ధారించడానికి కోరుకుంటున్నాడు.

*౩. అన్నా అనగా కృప:* గ్రీకులో అన్నా అంటే "కృప". హిబ్రూలో అదే పేరు హన్నా, మరియు ఇది కూడా "కృప" అని అర్థం ఇచ్చు పదమే. దేవుని అధ్బుతమైన కృప పొందిన స్త్రీలుగా *అన్నా మరియు హన్నా* ఉన్నారు. మనం రక్షించబడాలంటే కృప ద్వారా మాత్రమే అది సాధ్యం. 

(ఎఫెస్సీ 2:8 మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.) 

మనమందరం రక్షించబడాలని దేవుని గొప్ప కృపగా ఉన్న యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.  తీతు 2:11  ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన *దేవుని కృప* ప్రత్యక్షమై...

దేవుని కృప అందరికీ అందుబాటులోకి వచ్చింది. క్రీస్తులో నమ్మకం ఉంచితే అందరూ విముక్తి, రక్షణ పొందుతారని అర్థం.   (యోహాను 1:16  ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు) 

పాప విముక్తిద్వారా మనుష్యులను రక్షించిన కృప వారిని విడిచి పెట్టునది కాదు. వారిలో ఉండి వారిని బలపరచునది.  

 కీర్తనలు 86:13 ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది.మనం కేవలం కృప ద్వార మాత్రమే రక్షించ బడితిమి. 

"అర్హత లేనివాడు అర్హునిగా ఎంచ బడడమే కృప యొక్క నిర్వచనం. మనకు అర్హత లేకపోయినా యేసు తన కృప ద్వారా మనలను రక్షించుటకు కృపా స్వరూపుడుగా ఈ లోకంలో జన్మించినాడు. ప్రభువా అని పిలువడానికి కూడా అర్హతలేని మనకు తండ్రీ అని పిలిచే యోగ్యత నిచ్చింది ఆయన కృప.

 (2 కొరింది 12:9 అందుకునా కృప నీకు చాలును) ఎటువంటి వ్యక్తిగత, కుటుంబ, మానసిక, ఆర్ధిక, సామాజిక సమస్యలైనా సరే భయపడవద్దు. దిగులు చెందవద్దు. నీ ప్రియ రక్షకుడు నీకిస్తున్న వాగ్దానం 'నా కృప (యేసు) నీకు చాలు' కారణం ఆయన మన యెడల చూపు కృప గొప్పది. 

అవును! అవి ఎట్లాంటి పరిస్థితులైనాసరే. చివరకు అది అగ్నిగుండమైనా సరే. ఆయన కృప నీకు తోడుగా వుండబోతుంది. 

పర్వతములు తొలగి పోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు యెషయా 54:10

మనము చేయునదంతయు ఆయన కృపను బట్టియేగాని, మనము సాధించిన దేనిని బట్టి కూడా ఆయన సేవ చేయలేమని దేవుని వాక్యంలో మనము స్పష్టముగా చూచుచున్నాము.

కీర్తనలు 103:11 భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన  కృప అంత అధికముగా ఉన్నది. 

అన్నా పేరు మనకు దేవుని కృపను మరోసారి గుర్తు చేస్తున్నది.

అన్నా ప్రవక్తి గురించిన మరి కొన్ని విషయాలు రేపు పరిశీలిద్దాం. ప్రభువు తన గొప్ప కృపను మన హృదయాలలో సమృద్ధిగా కుమ్మరించును గాక. ఆమెన్! (


✳ *అన్నా ప్రవక్తి* ✳

 (రెండవ భాగం)

*దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో సేవచేసిన అన్నా*

(లూకా 2:37  దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవ చేయుచుండెను)

*4. అన్నా ఒక ప్రవక్తి ఉన్నది:* (లూకా 2:36 మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను.) 

ప్రవక్తలనగా దైవసత్యాలను దేవుని యొద్ద నుండి తెలిసికొని ప్రజలకు అందించువారు. 

(యేహెజ్కేలు 33:7 నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి యున్నాను గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను).

దేవాలయంలో ఉన్న పరిసయ్యులు గాని యాజకులు గాని, శాస్త్రులు గాని ఆ బాలుడే మెస్సియా అని గ్రహించలేక పోయారు. కాని అన్నా దేవుని ఆత్మ ద్వారా గ్రహించగలిగింది కారణం *ఆమె ప్రవక్తి.* 

సమయానుకూలంగా నడిపించువాడు సమస్తం సమకూర్చువాడు ఆయనే. సరైన సమయానికి అన్నా పరిశుద్ధాత్మ దేవుని ద్వార దేవాలయంలోనికి నడిపించ బడినది.

రోమా 8:28 దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. 

దేవుడు తన పరిచర్యలో అనేక మంది పురుషులనే గాక స్త్రీలను కూడా ప్రవక్తలగా వాడుకున్నాడు. కారణం ఆయన పక్షపాతం లేని దేవుడు. 

మిర్యాము, హుల్దా, డెబొరా, ఫిలిప్పు యొక్క నలుగురు కుమార్తెలు దేవునికొరకు ప్రవక్తలగా అద్భుతమైన సేవ చేశారు.

*5. దేవాలయమును విడువని అన్నా:* దేవాలయమును విడువక అనగా దేవుని ఆలయంలో అన్నా అన్నివిధాల సేవలను అందిస్తోంది. 

దేవుణ్ణి సేవించాలంటే బలంగా, చురుకుగా ఉండడం, లేదా అన్ని చోట్లా శుభవార్త ప్రకటించాలనీ ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూ ఉండడం తప్పనిసరి కాదు. వయస్సులో పెద్దవారగు వారికి ఇది ఎంతో ఆశీర్వాదకరమైన పరిచర్య. మందిరంలో ఏదోఒక పరిచర్య అందుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. అన్నా ఆరాధన మనకు ఎంతో మాదిరికరం. అందుకే అన్నా ప్రభు దర్శనం పొందగలిగింది. దావీదు కూడా చిరకాలం యెహోవా మందిరంలో నివసించాలని కోరుకున్నాడు. (కీర్తన 23:6 చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.)

*6. అన్నా ఆరాధన "ఉపవాసంతో కూడినది:* యూదులకు, సర్వసాధారణమైన సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆమె ఉపవాస ప్రార్ధనలు కొనసాగేవి.   తన ఆధ్యాత్మిక జీవనం కోసం, శరీరాన్ని అదుపులో ఉంచుకునేందుకు, దేవుణ్ణి వెతికేందుకు, స్వచ్ఛందంగా ఉపవాసం ఉండడం అని దీని అర్థం. 

(యోవేలు 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. కీర్తన 35:13 వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని; యెషయా 58:6,7 నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము.) 

ఆధ్యాత్మిక జీవనానికి సహాయకరమైన సాధనాన్ని సరిగ్గా వాడకపోతే సహాయం చెయ్యడానికి అసలు ఆధ్యాత్మిక జీవనమే లేదని అది బయటపెట్టవచ్చు. మనుషుల మెప్పుకోసం ఉపవాసం ఉండడం విపరీతం, ఘోరం అని బైబిల్ సెలవిస్తున్నది. (మత్తయి 6:17 ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ     ముఖము కడుగుకొనుము.)

యేసు కూడా ఉపవాసం మంచిదనీ, తగిన పని అని భావించాడు. ఒకప్పుడు ఆయన నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు (మత్తయి 4:1 అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా), 

తరువాత ఆయన శిష్యులు కూడా ఉపవాసం ఉంటారని చెప్పాడు(మత్తయి 9:15  పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉప వాసము చేతురు).   

ఏ రకం ఉపవాసానికైనా దేవుడు ఫలితం ఇవ్వడు గానీ సరైన ఉద్దేశంతో చేసినదానికే ఇస్తాడు. నిజమైన ఉపవాసం శిష్యునికి దేవునితో ఉన్న రహస్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది. ఏం జరుగుతున్నదీ ఇతరులకు కనీసం ఊహించడానికైనా సాధ్యం కాకుండా ఉండాలి. 

*7.అన్నా ఆరాధన ప్రార్థనతో కూడినది:*  దేవుడు ప్రార్ధన ఎడతెగక చేయమన్నాడు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏమి చేసారో నేడు ఈ శతాబ్దపు క్రైస్తవులైన మనము అదే చేయాలి. 

అనగా వాళ్ళు ప్రార్ధన చేశారు కనుక మనం కూడా ప్రార్ధన చేయాలి. దేవుడు మనలను ఎడ తెగక ప్రార్ధన చేయమన్నాడు అంటే అన్ని పనులు మానేసి కేవలం మోకాళ్ళు వంగి ప్రార్ధన చేయమని కాదు. సమయం ప్రకారం ప్రార్ధన చేయాలి ప్రతి పనిని ప్రార్ధనతో ప్రారంభించాలి. 

దేవుడు భక్తుల ప్రార్ధనలు మాత్రమే ఆలకిస్తాడు. ఆయన పాపుల ప్రార్ధనలు ఆలకించడు. (యోహాను 9:31- దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవ భక్తుడై యుండి అయన చిత్తము చొప్పున జరిగించిన యెడల అయన వాని మనవి ఆలకించును.) 

ప్రార్ధన చేయమన్న దేవుడు పాపుల మనవి ఆలకించను అని అంటున్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకించను అని అన్నాడు అంటే పాపుల కూడా ప్రార్ధన చేస్తారని అర్థమవుతుంది. దేవుడు ఒక వ్యక్తి యొక్క మనవి ఆలకించాలంటే అతడు దైవ భక్తుడై ఉండాలి.  

మనం కూడా అన్నావలె మనము కూడా దేవాలయం కొరకు దేవుని పని చేసి ఉపవాస ప్రార్ధనలతో దేవునిని ఆనందపరచుటకు ప్రభువు కృప మనకు తోడై యుండునుగాక!



✳ *అన్నా ప్రవక్తి* ✳

 ( మూడవ భాగం)

*ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా*



(లూకా 2:36 మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను.)

*8. అన్నా ఆషేరు గోత్రీకురాలు:* “ఆషేరు” అను మాటకు అర్ధము *భాగ్యము.* క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి వారు ఎంతో భాగ్యవంతులుగా ఉన్నారు. అన్నా అను ఈ ప్రవక్తి,  మెస్సియాగా ఈ లోకానికి వచ్చిన యేసునందు విశ్వాసముంచినది గనుక ఆమె ఎంతో *భాగ్యవంతురాలు*. 

"ఆషేరు" యాకోబు యొక్క తొమ్మిదవ కుమారుడు. ఆషేరు యెద్ద శ్రేష్టమైన ఆహారము కలదని యాకోబు ప్రవచించాడు. ఆది.కా 30:12. 

ఆ శ్రేష్టమైన ఆహారమే దేవుని వాక్యమే. అనుదినం ఎవరైతే దేవుని వాక్యం భుజిస్తారో వారే నిత్యం భాగ్యవంతులుగా ఉండగలరు. 

(యాకోబు 2:5 నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను...) 

(నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును *భాగ్యవంతులు*." 1 రాజులు 10:8 ) 

ప్రభువు యొక్క తలంపులకు, ఆయన ప్రణాళికలకు అనుగుణంగా *అన్నా* మాదిరిగా మనం కూడా జీవిస్తుంటే మన కంటే భాగ్యవంతులు ఈ భూమిపై ఎవరూ ఉండరు. 

*9. అన్నా పనూయేలు కుమార్తె:* పనూయేలు అనగా దేవుని ముఖాముఖిగా చూచిన స్థలం. యాకోబు మోకాళ్ళ ప్రార్ధన అనుభవాన్ని పోరాటాన్ని మనకు తెలియజేయుచున్న స్థలం. 

ప్రార్ధనలో పోరాడిన యాకోబు దేవుని ముఖదర్శనం చేయగలిగాడు. దేవుని వాక్యమే దేవునియొక్క ముఖం. *వాక్యము దేవుడై యుండెను.* యోహాను 1:1. 

మోషే కూడా ఆ దేవాది దేవుని ముఖాముఖి చూడాలి అన్నపుడు, దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నపుడు ఆ దేవుడు మోషేకి తననుతాను బయలు పరచుకున్నారు. కారణం మోషే యొక్క యథార్థత. 

మండుచున్న పొదయెదుట తన జీవితాన్ని యథార్థంగా దేవునికి సమర్పించినాడు మోషే. "యథార్థవంతులు ఆయన *ముఖదర్శనం* చేసెదరు." కీర్తన 11:7. దేవుని ముఖం చూడకుండానే దేవునిని ముఖాముఖిగా తెలుసున్న వ్యక్తిగా మోషే మారిన సందర్బం అది. అది ఒక అద్భుతం.

దేవుడు తన ముఖాన్ని మోషేకి చూపించలేదు కానీ తన మంచితన్నాన్ని మోషేకి చూపించారు. తన మహిమను మోషేకి చూపించారు. (నిర్గామ 33:18-23).

ఎప్పుడైతే వాక్యం ద్వారా నీతిమంతులుగా మార్చబడుదురో వారే దేవుని ముఖదర్శనం చేయుదురు. "నేనైతే నీతిగలవాడనై నీ *ముఖదర్శనం* చేసెదను." కీర్తన 17:15.

అన్నా గొప్ప ప్రార్ధనా పరురాలు. రేయింబవలు మోకాళ్ళ ప్రార్ధనా అనుభవం గలిగిన భక్తురాలు. అందుకే దేవాలయంలో యేసు నాధుని ముఖ దర్శనం చేయగలిగినది.   

*10. అన్నా దీర్ఘాయుష్షు చేత దీవించబడినది:*  (లూకా 2:37 యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలై యుండి,) అన్నా వయస్సు 100 సంవత్సరాల పైనే ఉన్నది. ఒక్కసారి ఆమె వయస్సు లెక్క చూస్తే, షుమారుగా 19 సంవత్సరాలకు వివాహం అయితే 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసింది. భర్త చనిపోయి అనాధ అయినా ఏకాకిగానే యుండి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవుని మీద ఆధారపడి దేవుని యందు ఎంతో భయభక్తులతో జీవించినది. 

యెహోవా యందు భయ భక్తులే దీర్ఘాయువునకు మూలం. ఆమె వయస్సు లెక్క చూస్తే దాదాపు 110 సంవత్సరాలు. జీవితంలో కాలం గడిచేకొద్దీ అనుభవం వస్తుంది. (యోబు 12:12) అయితే మరోవైపు, ఆధ్యాత్మిక పురోగతి వయసుతోపాటు యాంత్రికంగా రాదు. అందువల్ల, కేవలం గతంలో సంపాదించుకున్న జ్ఞానసంపదపై ఆధారపడే బదులు, దేవుని బిడ్డలు సంవత్సరాలు గడిచేకొద్దీ “జ్ఞానాభివృద్ధి” చేసుకోవడానికి అన్నా మాదిరి కృషి చేయాలి. 

యెహోవా మోషేకు పని అప్పగించినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. (నిర్గమకాండము 7:7 వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు..) 

ఆ కాలంలో ఆ వయసు వరకు జీవించడం అసాధారణ విషయంగానే పరిగణించ బడిందనేది స్పష్టం, ఎందుకంటే ఆయనిలా వ్రాశాడు: “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు. అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములు అగును.” (కీర్తన 90:10) 

అయినా, నేర్చుకునేందుకు తాను వృద్ధుడనని మోషే ఎన్నడూ తలంచలేదు. మోషే అనేక దశాబ్దాల దేవుని సేవలో, ఎన్నో ఆధిక్యతలు ఆనందిస్తూ, బరువైన బాధ్యతలను మోస్తున్నా, యెహోవాను ఇలా వేడుకున్నాడు: “దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును.” (నిర్గమకాండము 33:13)  

ప్రభువుతో తన సంబంధం ఎల్లవేళలా ఎదుగుతూ ఉండాలని మోషే సదా కోరుకున్నాడు. అదేవిధంగా
అన్నా కూడా తన జీవితమంతా దేవాలయంలో దేవుని సన్నిధికి అంకితం చేసిన గొప్ప ఘనురాలు. 

ఈ లోకంలో ఆన్నిటికన్నా దేవుని సన్నిధియే మిన్న అని గ్రహించిన ధన్యురాలు *అన్నా* మనకు ఎంతో మాదిరికరం. 

కీర్తన 96:6 ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి. కొలస్సి 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములై యున్నవి.

తన జీవితాంతం దేవుని సేవించి ప్రభు ముఖ దర్శనం చేసిన *అన్నా* వలే మనంకూడా ప్రభువును సేవించి ధన్యులమగుదము గాక! ఆమెన్!!
(సమాప్తం)

 దైవాశ్శీసులు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...