✍ పిల్లల్ని నడపవలసిన 7 మార్గాలు
ఈ కరోన సమయములో పిల్లలందరూ ఇంటిదగ్గరే ఉంటారు. ఈ సమయములో పిల్లల్ని సరైన మార్గములో ఎలా పెంచాలి, దైవ మార్గములో ఎలా పెట్టాలో వాక్యానుసారముగా ధ్యానిద్దాము.
*1. ప్రార్ధన చేయాలి:-*
"నీవు లేచి రేయి మొదటిజామున మొఱ్ఱ పెట్టుము.... నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము" ( విలాప 2:19). మనము సామాన్యముగా అనేక విషయాల గూర్చి ప్రార్ధన చేస్తాము. వ్యక్తిగత, కుటుంబ, సంఘ ప్రార్ధనలో పాలు పొందవచ్చు గాని, మన స్వంత బిడ్డల విషయమై ప్రత్యేకముగా ప్రార్ధించడానికి ఒక సమయం అంటూ కేటాయించిన వారు ఎంత మంది ఉన్నారు?
యోబు చూడండి " వారి వారి విందు దినములు పూర్తి కాగా... తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనపించి, వారిని పవిత్ర పరిచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను.. (యోబు 1:5)". వీళ్ళు పసిపిల్లలు కాదు, ఎదిగినవారే కావున పాపము చేయుటకు అవకాశము ఉంది, కాబట్టే నిత్యము యోబు వారి నిమిత్తము దహనబలులు అర్పిస్తున్నాడు. అయితే ఈ రోజుల్లో యోబు వలే ప్రార్ధన, అర్పణ చేయుట చాలదు. వారికీ సువార్త చెప్పాలి. దీపానికి నూనె, వత్తి ఉంటె వెలగదు, దానిని అగ్నితో వెలిగించాలి. అప్పుడప్పుడు ఆ వత్తిని నలిపి, సవరిస్తూ ఉండాలి. అలగుననే పిల్లల్ని కూడా సవరించాలి. నా స్నేహితుని పిల్లల్ని క్రమశిక్షణ పేరుతో ఇంటిలోనే పెట్టి చదివిస్తూ ఉంటాడు. అలాకాదు, ఆటపాటలలో స్వేచ్చనిచ్చి వారితో మమేకమై పోవాలి. వారితో ఉంటూ వారి తప్పులు సవరిస్తూ ఉండాలి. బహిర్గత మైన తప్పులను వాక్యముతో సరిచేయాలి.
యవ్వన బిడ్డలకు అధిక స్వేచ్ఛ ఇవ్వకూడదు, వారి ప్రవర్తన గమనించాలి. కుటుంబ ప్రార్ధనలో కూర్చోబెట్టాలి. ఆదివారము సంఘానికి తీసుకెళ్లాలి. మా సంఘానికి స్త్రీలు తప్ప యవ్వనస్థులు, పురుషులు మందిరానికి రారు. స్త్రీలుగా మీరే బాధ్యత తీసుకోవాలి.
*2. బోధించాలి:-*
" నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చుండనపుడు, త్రోవను నడుచునపుడును, పండుకొనునపుడును, లేచినపుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా నీ చేతికి కట్టుకొనవలెను"( ద్వితీ6:4-9). దేవుని ఆజ్ఞలను మన బిడ్డలకు బోధించాలి.
భోధించువాడు పాటించవలసిన నియమాలు:
A. దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో
ప్రేమించాలి.
B. వాక్యమును హృదయంలో ఉంచుకోవాలి.
C. కుమారులకు అభ్యసింపజేయాలి.
D. ఎప్పుడు వాటిగూర్చే మాట్లాడాలి.
E. చేతికి కట్టుకోవాలి
F. ద్వార బంధాల మీద రాసుకోవాలి.
G. రక్షించిన యెహోవాను మారువకుండా
జాగ్రత్త పడాలి.
(ద్వితీ 6:4-9)
మనము ఆచరించలేనిదే మన బిడ్డలకు బోధించలేము. ఒకవేళ అలా చేస్తే వేషధారులము అవుతాము. మోషేను, సమూయేలును వారి తల్లిదండ్రులు పెంచిన విధానము వలనే వారు ప్రవక్తలుగా, మార్గదర్శులుగా అయ్యారు. మరి మీరు, మీ యొక్క పెంచిన విధానం ఒకసారి చూద్దాం.
*3. త్రోవ నేర్పాలి:-*
"బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనపుడు దాని నుండి తొలిగిపోడు" (సామెతలు 22:4). బిడ్డలు బుడి బుడి నడకలు వేసేటప్పుడు వారికీ చేయూత నిస్తాము. ఇంట్లో నడక కాస్త నేర్చుకొని నడుస్తుంటే జాగ్రత్తలు చేప్తాము. మరి పెద్దవాడు అయిన తరువాత హద్దు దాటుతుంటే సరిచేయవల్సిన బాధ్యత ఎవరిది?
పిల్లలికి వేలకు వేలు పెట్టి దగ్గర ఉండి మరి స్కూల్ కి పంపిస్తాము. మరి సుండేస్కూల్ కి పంపడానికి ఎందుకు జాగ్రత్త తీసుకోము?
స్కూల్ హోంవర్క్ దగ్గర ఉండి నేర్పిస్తాము. మరి దేవుని వాక్యాన్ని దగ్గర ఉండి ఎందుకు నేర్పము?
దేవుని వాక్యాన్ని కూడా దగ్గర ఉండి నేర్పుము. అల నేర్పక,
యాకోబు (ఆది 37),
ఏలీ (1సమూ3:13),
దావీదు (2సమూ13:39, 14:15),
సమూయేలు (1 సమూ8:1-9) చాల బాధపడ్డారు.
"బాలుని హృదయంలో మూఢత్వము స్వభావికముగా పుట్టను , శిక్షాదండము దానిని తొలివేయును" (సామెతలు 22:15).
*4. బండకు కొట్టాలి.*
"నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు" (కీర్తన 137:9). ఈ వచనం బాబులోను గూర్చి చెప్పబడింది. బాబులోను బాబేలు నుండి వచ్చినది. బాబేలు అనగా కలవరము. ఈ పట్టణము నాశనమునకు పాత్రమయినది (ప్రకటన 14:8). ఆ పట్టణపు పిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు అని ప్రవచనం. ప్రస్తుత లోకాన్ని బబులోనుతో పోల్చవచ్చు. ఆయినా ఈ లోకాన్ని రక్షించడానికి,
నిషేధించబడిన రాయిగా (కీర్తన 18:25),
పునాది రాయిగా (ఎఫెసి 2:20),
పగులగొట్టబడిన బండగా(కీర్తన 78:15 )
ఆత్మ సంబంధ బండగా (1కోరింథి 10:4) తన్ను తాను బయలపరుచుకున్నాడు. ఆ బండ క్రిస్తే. ఆ బండకేసి కొట్టే సుండేస్కూల్ టీచర్ వద్దకు మన పిల్లల్ని పంపిస్తున్నమా?
*5. దేవుని వాక్యాన్ని మాట్లాడాలి:-*
"నీవు నీ కుమారులకు అభ్యసింపజేసి .... వాటి గూర్చి మాట్లాడాలి" (ద్వితీ6:7). బైబిల్ మనకు ₹150 కే లభించవచ్చు కాని అది మానవ హృదయానికి అంతుబట్టనిది. ఆ వాక్యాలను దిన దినము ధ్యానించాలి. వాటి గూర్చి పిల్లలతో మాట్లాడాలి. ఆఫీస్ విషయాలు, బయటి విషయాలు కాకుండా దేవుని వాక్యాన్ని గూర్చి మాట్లాడుదాం.
*6. బెత్తము వాడాలి:-*
"బెత్తము వాడని వాడు కుమారునికి విరోధి" (సామెతలు 13:24). మోషే గొర్రెలు కాయడానికి వాడిన కర్ర దేవుని కఱ్ఱగా మారి ఇశ్రాయేలీయులను నడిపించుటకు, ఎర్ర సముద్రం పాయలు చేయుటకు వాడబడింది. ఎశ్శయా మొద్దు నుండి పుట్టిన చిగురు ఏసుక్రీస్తు. మన బిడ్డలకు అయన తాకిడి అవసరం. అయన వాడుకొనే దుడ్డు కర్ర, దండము శక్తి కలిగిన వాక్యమే. ఆ వాక్య గద్ధింపు నీ బిడ్డలకు అవసరం.
( సామెతలు 23:13, 15:5, 29:1, హెబ్రీ 12:8)
*7. ప్రతిష్టించాలి:-*
"ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ... యెరూషలేమునకు తీసుకొని పోయిరి" (లూకా 2:24). నిర్గమ 13:12 లో చెప్పడినట్లు ధర్మశాస్త్ర ప్రకారము యుధులలో పుట్టిన తోలిచులు బిడ్డను దేవునికి ప్రతిష్ఠించాలి. అంటే అందరూ కదా?
"..ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సముహముగా, పరిశుద్ధ జనమును దేవుని సోత్తయిన ప్రజలమై యుంటాము" (1పేతురు 2:9). అర్ధం అయ్యిందా అందరూ దేవునికి ప్రతిష్టించబడాలి.
" మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి " (హెబ్రీ 12:1).
మన బిడ్డలను దేవునికి ప్రతిష్టించి, దేవుని సన్నిధిలో నిత్యం ఎదుగునట్లు వారికీ వాక్యం బోధించి, త్రోవను నేర్పి, వాక్యము తో మాట్లాడుతూ, బండతో కోడుతూ, ప్రార్ధించి, దేవునికి సమర్పించాలి. అప్పుడే మన కుటుంబము భూలోకములోనే పరలోకముగా ఉండును.
ప్రభువు కృప మీకు తోడై యుండును గాక! ఆమెన్!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి