ప్రవచన నెరవేర్పు:సుమయోను
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
💫డిశంబర్ ఇరవై ఐదవ తారీఖును క్రిస్మస్ పండుగగా లోకమంతా ఆచరిస్తుంది! యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించి ఇంచుమించు రెండువేల సంవత్సరములు అయినదని అందరూ గుర్తిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు క్రొత్తగా వచ్చిన దేవుడుగానే అనేకులు భావిస్తున్నారు గాని, జగత్పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ఉండెను. ఆదాము, హవ్వలు పాపము చేసినప్పుడే దేవుడు సర్పము రూపములో ఉన్న సాతానుతో - నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు వైరము కలుగజేతునని చెప్పెను (ఆదికాండము 3:15). కన్యయైన మరియ గర్భవతియై కుమారుని కనును; ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించునను విషయము అప్పుడే నిర్ణయించబడెను.
💫ప్రవచనముల నెరవేర్పుగా యేసుక్రీస్తు జన్మించినప్పుడు ప్రథమ ఫలమైన క్రీస్తు యెరూషలేములోని దేవాలయంలోనికి తీసుకొని రాబడెను. “యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై యుండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి యుండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను” (లూకా 2:25,26).
💫ఆ కాలంలో ఇశ్రాయేలీయులు ఎటువంటి ఆదరణ లేక, రోమా ప్రభుత్వము క్రింద నలిగిపోవుచుండిరి. హేరోదు వంటి కూరమైన రాజు పరిపాలనలో అవస్థలు పడుచుండిరి. దేవుడు తన ప్రవక్తలను పంపించి, అనేక రీతులుగా హెచ్చరించి నప్పటికీ; పడిపోయిన మానవ స్వభావాన్ని చూపించిన జనులు పాపమునకు లోనై, అవిధేయులైరి. అయితే సుమెయోను రక్షణ కర్తయైన మెస్సీయ రానైయున్నాడని, ఆయన తన ప్రజల పాపములను క్షమించనై యున్నాడని, మరి పాపము లేకుండా జీవించునట్లుగా పాప ప్రాయశ్చిత్తముగా తన ప్రాణము పెట్టనైయున్నాడని విశ్వసించెను. అతడు పండు వృద్ధుడగు వరకు అటువంటి విశ్వాసముతోనే ఎదురుచూచుచు, ఆ రక్షకుని తన కన్నులారా చూచువరకు తాను మరణించకూడదని ఆశించెను. దేవుని నీతిని, విశ్వాసమును కలిగి ప్రవచనాల నెరవేర్పు కొరకు ఎదురుచూచుచున్న అతనిపై పరిశుద్ధాత్ముడు ఉండెను.
💫ప్రజాసంఖ్య వ్రాయబడుచున్నందున ఆ సంఖ్యలో వ్రాయబడుటకు యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక నిండు చూలాలిగా
ఉన్న మరియతో బేబ్లె హేము గ్రామానికి వెళ్లవలసి వచ్చెను. అచ్చట సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో లోక రక్షకుడైన యేసు జన్మించవలసి వచ్చెను. ధర్మశాస్త్రాన్ని యెరిగి, నెరవేర్చుటకు ఆశించిన మరియ, యోసేపులు ఎనిమిదవ దినమున శిశువుతో పాటు దేవాలయమునకు వెళ్ళిరి (నిర్గమ 13:12; లేవీయ 12:1-3). సరిగ్గా అదే సమయానికి సుమయోను ఆత్మవశుడై దేవాలయము లోనికి వచ్చెను. “అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను - నాథా, యిప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు నీ మహిమగాను నీవు సకల ప్రజల యెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని” (లూకా 2:27-32) అనెను.
💫ఎంత ఆశ్చర్యము? చిన్న బాలుడిగా తన చేతుల్లో ఉన్న యేసుక్రీస్తును చూచిన సుమెయోను తన విశ్వాసపు నేత్రములతో ఆ బాలుడు పెరిగి పెద్దవాడగుట, సిలువలో ప్రాణమిచ్చి రక్షణ సిద్ధపరచుట చూచెను. బాలుడుగా ఉన్న క్రీస్తులో సంపూర్ణమైన క్రీస్తును చూచెను. అందుకే 'నీ రక్షణ కన్నులారా చూచితి'నని చెప్పెను. సిలువ శ్రమలను, వేదనలను చూచిన సుమెయోను 'నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని' మరియతో చెప్పెను. అతని వృద్దాప్యము వలన అతని దృష్టి మందగిల్లి ఉండవచ్చును గాని, అతని విశ్వాసం అతనికి అంత దూరదృష్టిని ప్రసాదించింది.
💫ఆ సుమెయోను ఆ చిన్న బాల యేసులో సిలువపై మరణించి, పునరుత్థానుడైన క్రీస్తును చూచెను. ఈనాడు క్రిస్మస్ పండుగ చేసుకొనే మనం పశువుల పాకలో తొట్టిలో పరుండిన బాల యేసును చూచునప్పుడు, పాప ప్రాయశ్చిత్తానికి బలిగా ప్రాణమిచ్చి పునరుత్థానుడైన సంపూర్ణ క్రీస్తును చూడగలగాలి! ఆనాటి గొల్లలు రక్షకుడు పుట్టాడని సంతోషించారు గాని, ఈనాటి మనం రక్షణ పొందామని ఆనందించాలి!
💫ఆనాటి సుమెయోను బాల యేసులో సంపూర్ణ క్రీస్తును చూచి పరవశించెను. అయితే ఈనాటికి క్రైస్తవులు సిలువ వేయబడి, తిరిగి లేచిన క్రీస్తును గుర్తించలేక పోవుచున్నారు. ఆనాటి సుమెయోను ఎనిమిది దినముల యేసును చూచి రక్షణ పొందెను. అయితే ఈనాడు అనేకులు సిలువలో రక్షణ కార్యము సమాప్తమైనదని చెప్పి ఇంచుమించు రెండువేల సంవత్సరములైనప్పటికీ ఆ క్రీస్తు యిచ్చు రక్షణ పొందకపోవటం ఎంత విచారం? ఆ సుయోయోను రక్షకుని కొరకు పండు వృద్ధుడగు వరకు కనిపెట్టవలసి వచ్చెను. ఈనాడు క్రీస్తును నీవు నీ బాల్య దినముల యందే కనుగొనునట్లు సిద్ధముగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భములోనైనా క్రీస్తును అంగీకరించి, ఆత్మ రక్షణ పొందుము! - యన్. జయపాల్ గారు...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి